మెత్తబడ్డ బండారు: బాబుతో భేటీ, అన్యాయం చేయనని బాబు హామీ
మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో మంత్రి పదవి దక్కకపోవడంతో పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మెత్తబడ్డారు.
అమరావతి: మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో మంత్రి పదవి దక్కకపోవడంతో పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మెత్తబడ్డారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో బండారు సత్యనారాయణమూర్తి మంగళవారం నాడు సమావేశమయ్యారు.పార్టీ సీనియర్లకు న్యాయం చేస్తానని బాబు హామీ ఇచ్చారు.
గత నెల 2వ, తేదిన మంత్రివర్గాన్ని చంద్రబాబునాయుడు పునర్వవ్యవస్థీకరించారు. మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో విశాఖ జిల్లా నుండి బండారు సత్యనారాయణమూర్తికి చోటు లభిస్తోందని భావించాడు. అయితే మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కలేదు.
అంతేకాదు పార్టీకి నష్టం చేసిన వారికి వైసీపి నుండి వచ్చినవారికి మంత్రిపదవులు కట్టబెట్టడంపై బండారు సీరియస్ అయ్యారు. రెండు రోజులు ఆయన పార్టీ నాయకులకు దొరకుండానే వెళ్ళిపోయారు.
అయితే అనకాపల్లి ఎంపీ ఆవంతి శ్రీనివాస్ తో పాటు ఇతర నాయకులు ఆయనతో సంప్రదింపులు జరిపారు.అయితే తన కూతురు వివాహం తర్వాత పార్టీ నాయకత్వంపై తాడోపేడో తేల్చుకొంటానని బండారుసత్యనారాయణమూర్తి చెప్పారు.
అయితే మంగళవారం నాడు అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కలిశారు.మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో తనకు అన్యాయం జరిగిన విషయాన్ని బండారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు.
పార్టీ కోసం ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్నానని పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్న కాలంలో కూడ పార్టీ కోసం పనిచేశానని ఆయన వివరించారు. సామాజిక సమీకరణాల కారణంగా తనకు అన్యాయం చేయడం సరికాదన్నారు బండారు సత్యనారాయణమూర్తి.
బండారు సత్యనారాయణమూర్తి వాదన విన్న సీఎం చంద్రబాబునాయుడు సానుకూలంగా స్పందించారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో కొందరికి పదవులు ఇచ్చానని చెప్పారు. పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. సీనియర్లకు న్యాయం చేస్తానని బాబు బండారుకు చెప్పారు.