ఎన్నికల్లో పోటీ చేయను, రాజకీయాలకు గుడ్బై: బెజవాడ ఎంపీ కేశినేని నాని సంచలనం, టీడీపీకి భారీ షాక్
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని, తన కూతురు కూడా పోటీ చేయదని స్పస్టం చేశారు.

బెజవాడ రాజకీయాల్లో కేశినేని నాని ముద్ర
కాగా, కేశినేని నాని.. విజయవాడ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ నాయకుడు. ట్రావెల్ బిజినెస్ నుంచి అంచెలంచెలుగా రాజకీయ నేతగా ఎదిగారు. తెలుగుదేశం పార్టీ నుంచి రెండుసార్లు ఏంపీగా పోటీ చేసి గెలుపొందారు. రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా తాను మాత్రం ఎదురొడ్డి బెజవాడలో ఘన విజయం సాధించారు.
ఆ తర్వాత నానితో పాటు ఆయన కూతురు కూడా పాలిటిక్స్లో యాక్టివ్ అయ్యారు. తాజాగా, జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం శతవిధాలా ప్రయత్నించారు కేశినేని నాని. మరోవైపు సైకిల్ దిగి కమలం గూటికి చేరుతారనే టాక్ వినిపించింది. కానీ, నాని మాత్రం నో కామెంట్ అంటూ దాటవేశారు.

పార్టీ మారడం కాదు.. రాజకీయాలకే కేశినేని నాని గుడ్బై..
పార్టీ మార్పుపై ఎప్పుడు ఎక్కడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే కొంతకాలంగా టీడీపీ కార్యాలయానికి దూరంగా ఉంటున్నారు. నిజానికి రాజకీయాలకు దూరంగా ఉండాలని గత ఎన్నికలకు ముందే నాని నిర్ణయం తీసుకున్నారు. అధినేత చంద్రబాబు సూచన మేరకు పోటీ చేసి రెండోసారి కూడా విజయం సాధించారు. కొద్దిరోజులుగా పార్టీకి, నియోజకవర్గానికి దూరంగా ఉండటంతో కేశినేని టాపిక్ బెజవాడ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో కేశినేని నాని మీడియాతో సంచలన విషయాలను పంచుకున్నారు. తెలుగుదేశం పార్టీని వీడనంటున్న కేశినేని నాని.. రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. డబ్బు, పదవులపై ఎలాంటి ఆశలేదని.. వచ్చే నిధులతో తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్నారు. ఆయన కూతురు శ్వేత చౌదరి టాటా ట్రస్ట్లోకి వెళ్లిపోయింది. దీంతో తండ్రీబిడ్డలిద్దరూ నెక్ట్స్ ఎలక్షన్లో పోటీ చేయబోరని స్పష్టమైంది.
Recommended Video

టీడీపీకి వరుస షాక్లు.. కేశినేని నాని లాంటి బలమైన మరో నేత ఎవరు?
కాగా, రాజకీయాలకు దూరంగా ఉండటంపై ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుకు సమాచారమిచ్చారు కేశినేని నాని. అలాగే వచ్చే ఎన్నికల్లో తన స్థానం వేరే అభ్యర్థిని కూడా చూసుకోవాలని చెప్పారట. ప్రస్తుతానికి నాని సిమ్లాలో ఉన్నారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో వరుస విజయాలను అందించిన కేశినేని నాని స్థానంలో వచ్చే నేత ఎవరనేదానిపై చర్చ జరుగుతోంది. మరో నేత వస్తే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీని చాలా మంది సీనియర్, జూనియర్ నేతలు వీడారు. తాజాగా, మాజీ మంత్రి హనుమంతరావు కూడా పార్టీని వీడారు. ఆయన వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది నాయకులు టీడీపీని వీడి అధికార వైసీపీలో చేరారు. తాజాగా, కీలక నేతగా ఉన్న కేశినేని నాని కూడా టీడీపీకి దూరం కావడంతో ఆ పార్టీకి భారీ లోటుగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడకు చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా టీడీపీని వీడిన విషయం తెలిసిందే. ఆయన వైసీపీ సర్కారుకు మద్దతు పలికారు.












Click it and Unblock the Notifications