వైసిపిలో ఉంటా, చంద్రబాబు బాధపడుతున్నారు: ఎమ్మెల్యే కోన రివర్స్
విజయవాడ: తనకు పార్టీ మారే ఉద్దేశ్యం లేదని, తాను వైసిపి అధినేత జగన్ వెంటే ఉంటానని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి బుధవారం నాడు చెప్పారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారం సరికాదన్నారు. తన పైన దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
తాను టిడిపిలో చేరుతాననే ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని చెప్పారు. తనకు జగన్ నాయకత్వం పైన నమ్మకం ఉందని, ఆయనతోనే ఉంటానని చెప్పారు. పోలవరం నిర్మాణానికి కేంద్ర బడ్జెట్ నుంచి అవసరమైన నిధులను సాధించడంలో తెలుగుదేశం పార్టీ, ఏపీ సీఎం చంద్రబాబు విఫలమయ్యారన్నారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించుకోవడంలో టిడిపి విఫలమైందన్నారు. ప్రతిపక్షాలను కలుపుకుని కేంద్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒత్తిడి తీసుకువస్తే ఏపీ అభివృద్ధికి నిధులు వస్తాయన్నారు.
ఆ పని చేయకుండా పదిమంది వైసిపి ఎమ్మెల్యేలను టిడిపిలో కలుపుకోవడం వల్ల రాష్ట్రం, ప్రజలకు ఎలాంటి మేలు జరగదని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి నిధులు మంజూరు చేయించడంలో బిజెపిపై టిడిపి నేతలు పోరాటం చేయడం లేదని సీఎం చంద్రబాబు బాధపడుతున్నారని పేర్కొన్నారు.
పురంధేశ్వరికి ఎందుకు అంత అసహనం: వర్ల
బిజెపిలో చేరిన కాంగ్రెస్ నాయకుల పట్ల బిజెపి అధిష్టానం జాగ్రత్తగా ఉండాలని టిడిపి నేత వర్ల రామయ్య బుధవారం సూచించారు. సీఎం చంద్రబాబుపై పురంధేశ్వరికి ఎందుకు అంత అసహనమని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కూతురు అయిన మీరు టిడిపి అధికారంలో ఉంటే సంతోషించాల్సింది పోయి.. విమర్శలు సరికాదన్నారు. మోడీ, చంద్రబాబు జోడీ బ్రహ్మాండంగా ఉందని, మీరు దానికి బీటలు వేసేలా ఉన్నారని విమర్శించారు.