మోహన్ బాబు సంచలనం - నేను బీజేపీ మనిషిని : ఇక సీఎం జగన్ కు గుడ్ బై..!!
పెదరాయుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజకీయంగా వైసీపీతో కలిసిన ఆయన ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు కొత్త లెక్కలకు దారి తీస్తున్నాయి. తన విద్యా సంస్థలకు సంబంధించిన ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిల కోసం గతంలో మోహన్ బాబు తన కుమరులు.. విద్యానికేతన్ విద్యార్ధులతో కలిసి రోడ్డు పైన నిరసన వ్యక్తం చేసారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించటం లేదని ఆందోళనకు దిగారు. ఈ రోజు తిరుపతిలో ఆయన ఈ కేసు విషయంలో కోర్టుకు హాజరయ్యారు. అంతకు ముందు ఆయన తిరుపతిలోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి కోర్టు వరకు తన కుమారులు..ఆ కేసులో ఉన్న సంస్థ సిబ్బందితో కలిసి పాదయాత్ర గా కోర్టుకు హాజరయ్యారు.
బీజేపీ మనిషిని..అధికారంలో ఉండాలని
తాను బీజేపీ మనిషినని.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో తాను ఒకరినని...తాను రియల్ హీరోని... అంటూ వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కుటుంబంతో మోహన్ బాబుకు బంధుత్వం ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరిన మోహన్ బాబు ఆ పార్టీ అభ్యర్ధుల విజయం కోసం ప్రచారం చేసారు. జగన్ సీఎం అవ్వాలంటూ ప్రచారంలో పదే పదే చెప్పుకొచ్చారు.
వైసీపీ ఎన్నికల్లో గెలిచి..సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత క్రమేణా మోహన్ బాబు దూరం పాటిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే.. మోహన్ బాబు టీటీడీ ఛైర్మన్ లేదా రాజ్యసభ ఇస్తారనే ప్రచారం సాగింది. ఆ తరువాత ఫిలిం డెవలప్ మెంట్ బోర్డు ఛైర్మన్ పదవి ఇస్తారనే వాదన వినిపించింది. కానీ, ఎటువంటి పదవులు దక్క లేదు. కొద్ది నెలల క్రితం మోహన్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.
అక్కడే సంబంధాలు దెబ్బ తీసాయా
ప్రధాని తనకు ఇచ్చిన గౌరవానికి మోహన్ బాబు సంతోషం వ్యక్తం చేసారు. దీంతో..ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్దమైందనే ప్రచారం సాగింది. కానీ, మోహన్ బాబు బీజేపీలో చేరలేదు. ఆ తరువాత కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చిన మోహన్ బాబు తాను మోదీకి మద్దతు దారుడినని..ఆయనంటే ఇష్టపడతానని.. ప్రధాని సైతం తనకు గౌరవం ఇస్తారని చెప్పుకొచ్చారు.
ఇక, జగన్ సీఎం కావాలని తాను కోరుకున్నానని.. జగన్ సీఎం అయ్యారు..అంతే నంటూ వ్యాఖ్యానించారు. తాను ఎటువంటి పదవులు ఎప్పుడూ అడగలేదని.. ఇస్తానని ఆయన చెప్పలేదంటూ క్లారిటీ ఇచ్చారు. కొద్ది కాలం క్రితం టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్లుగా వివాదం సాగుతున్న సమయంలనూ ప్రభుత్వంతో చర్చల్లో చిరంజీవి కీలక పాత్ర పోషించారు.
కాషాయం కండువా కప్పుకుంటారా
ఆ తరువాత సినీ హీరోలు.. కొందరితో కలిసి చిరంజీవి టిక్కెట్ల రేట్ల ధరల అంశం పైన సీఎంతో చర్చించారు. ఆ సమయంలో మోహన్ బాబును సైతం ప్రభుత్వం ఆహ్వినించిందని..కానీ, ఆహ్వానం తమకు అందకుండా కొందరు చేసారంటూ ఆ తరువాత సీఎంను కలిసిన మోహన్ బాబు తనయుడు విష్ణు చెప్పుకొచ్చారు. ఆ చర్చల్లో కీలకంగా వ్యవహరించిన నాటి మంత్రి పేర్ని నాని సైతం హైదరాబాద్ లో మోహన్ బాబు ఇంటికి వెళ్లి కలిసారు. అయితే, అది కేవలం మర్యాద పూర్వకంగానే జరిగిన భేటీగా ఇద్దరూ స్పష్టత ఇచ్చారు.
కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా
కోర్టులో హాజరైన తరువాత స్పందించిన మోహన్ బాబు..కేసు వాయిదా వేశారు..వచ్చేశానంటూ స్పష్టత ఇచ్చారు. తాను ఏది మాట్లాడినా తప్పు అవుతుందని..సమన్లు తనకు అందలేదని.. న్యాయమూర్తి పిలిచారు..పేపరు ఇచ్చారు..సంతకం పెట్టమన్నారు..వాయిదా వేశారు..వచ్చానని మోహన్ బాబు చెప్పారు. ఇక, ఇప్పుడు తాను బీజేపీ మనిషని అంటూ మోహన్ బాబు చెప్పటం ద్వారా..ఇక, సీఎం జగన్ తో రాజకీయంగా మోహన్ బాబు దూరం కానున్నారనే ప్రచారంతో పాటుగా తాజా వ్యాఖ్యలు అటు రాజకీయ వర్గాలతో పాటుగా పొలిటికల్ సర్కిల్స్ లోనూ ఆసక్తి కర చర్చకు కారణం అవుతోంది.