అదే జరిగితే గుండు గీయించుకుంటా.. వైసీపీలో ఎవరు సిద్దం?: బోండా ఉమా ఛాలెంజ్..
నంద్యాలలో ఓటమి పాలైతే తాను గుండు గీయించుకోవడానికి సిద్దమన్నారు ఎమ్మెల్యే బోండా ఉమా.
కర్నూలు: 'నంద్యాల ఉపఎన్నిక' ఏపీలో ఇప్పుడెక్కడ చూసినా దీని గురించే చర్చ. పార్టీల అంచనాలకు తోడు ఇటు మీడియా, అటు జనం ఎవరి లెక్కల్లో వారు మునిగిపోయారు. తోచిన రీతిలో విశ్లేషణలు చేస్తూ.. పలానా పార్టీయే గెలుస్తుందంటూ జోస్యం చెబుతున్నారు.
మరోవైపు ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరడంతో మాటల యుద్దం మరింత ముదిరిందనే చెప్పాలి. ఉపఎన్నికలో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి అఖిలప్రియ ఇప్పటికే ప్రకటించగా.. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మరో సవాల్ చేశారు.
నంద్యాలలో ఓటమి పాలైతే తాను గుండు గీయించుకోవడానికి సిద్దమని, ఒకవేళ వైసీపీ ఓడిపోతే గుండు గీయించుకునేందుకు మీరు సిద్దమా? అని ఆ పార్టీ నేతలకు ఉమా సవాల్ విసిరారు. వైసీపీ తరుపున ఉపఎన్నికలో పాల్గొంటున్నవారెవరైనా ఈ సవాల్ స్వీకరించడానికి సిద్దంగా ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు.
మొత్తం మీద ఎన్నికల పుణ్యమాని నేతలు గుండు గీయించుకునేదాకా పరిస్థితులు వెళ్తున్నాయన్నమాట. మరి బోండా ఉమా సవాల్ను వైసీపీలో ఎవరు స్వీకరిస్తారో?.. నిజంగా సవాల్ను స్వీకరించి ఎవరు గుండు గీయించుకుంటారో? అన్నది వేచి చూడాల్సిందే.