కస్టమర్ సర్వీసులా ఐఏఎస్ - పీవీ రమేష్ ట్వీట్ కలకలం- జగన్ పై గురి పెట్టారా ?
మన దేశంలో అఖిల భారత సర్వీసులకు ఒకప్పుడు ఎంతో విలువ ఉండేది. ఓ కుటుంబంలో ఏఐఎస్ సర్వీసుకు ఒకరు ఎంపికైనా కొన్ని తరాల వరకూ చెప్పుకునే వారు. ప్రభుత్వ విధానాలను రూపొందించడంలో, వాటిని అమలు చేయడంలో వీరి పాత్ర ఎంతో కీలకం. అలాంటి బ్యూరోక్రాట్లు కొన్నేళ్లుగా రాజకీయ విష వలయంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా వీరికి చుక్కలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో వీరు పోషించిన పాత్రను బట్టే ప్రస్తుత స్ధానాలు నిర్ణయం అవుతున్నాయి. దీంతో వారిలో అసంతృప్తి కూడా నానాటికీ పెరిగిపోతోంది. ఇదే విషయాన్ని పంజాబ్ కు చెందిన ఓ రిటైర్డ్ ఐఏఎస్ ట్వీట్ చేయగా.. తాజాగా ఏపీ సీఎంవో బాధ్యతల నుంచి తప్పించిన రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ దీన్ని రీట్వీట్ చేశారు.
వైసీపీలో మరో పవర్ సెంటర్- సజ్జల బాధ్యతల్లో కోత- అంతుబట్టని జగన్ అంతరంగం...
పీవీ రమేష్ ట్వీట్ కలకలం...
గతంలో ఏపీ ప్రభుత్వంలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సీనియర్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ ప్రస్తుత జగన్ సర్కారులోనూ నిన్న మొన్నటి వరకూ కీలకంగా ఉన్నారు. రిటైర్మెంట్ తర్వాత కూడా సీఎంవోలో ప్రభుత్వ సలహాదారుల్లో ఒకరుగా, కీలకమైన విద్య, వైద్యం వంటి శాఖల బాధ్యతలు చూశారు. గతేడాది కాలంగా ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పాటు నీతి ఆయోగ్ వంటి సంస్ధల వద్ద కూడా ప్రభుత్వ గళాన్ని గట్టిగా వినిపించారు. కరోనా వచ్చాక కూడా ప్రభుత్వం తరఫున సహాయక చర్యలను పర్యవేక్షించారు. కానీ పలు కారణాలతో జగన్ సర్కారు ఆయన్ను తాజాగా బాధ్యతల నుంచి తప్పించింది. ఆ తర్వాత మౌనంగా ఉంటున్న పీవీ రమేష్ తాజాగా పంజాబ్ కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ చేసిన ఓ ట్వీట్ ను రీ ట్వీట్ చేశారు. ఇది కాస్తా సంచలనమైంది.
కస్టమర్ సర్వీస్ లా ఐఏఎస్...
1961 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన కేబీఎస్ సిద్ధూ ( శ్రీ సిద్ధూ ) తాజాగా ఓ ట్వీట్ పెట్టారు. ఇందులో దేశంలో ఐఏఎస్ అనేది రాజకీయ నేతలు, వ్యాపారస్తులను మెప్పించే కస్టమర్ సర్వీస్ గా మారిపోయిందని వాపోయారు. ఆయన ట్వీట్ వెనుక ఉద్దేశమేంటో తెలియదు కానీ మన పీవీ రమేష్ దీన్ని రీట్వీట్ చేశారు. సాధారణ పరిస్ధితుల్లో అయితే ఈ ట్వీట్ కు పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదేమో కానీ, ప్రస్తుతం సీఎం జగన్ సీఎంవోలో తనను ఏరికోరి తెచ్చిపెట్టుకున్న ఏడాదికే బాధ్యతల నుంచి తప్పించిన సందర్భంలో ట్వీట్ చేయడంతో ఇది కాస్తా వైరల్ అయింది. ఈ ట్వీట్ చూస్తే జగన్ తనను కస్టమర్ సర్వీసులా వాడుకుని వదిలేశారా అనే అర్దం వచ్చేలా ఉండటంతో పీవీ రమేష్ ట్వీట్ సంచలనంగా మారిపోయింది.
పరోక్షంగా అసంతృప్తి వెళ్లగక్కారా ?
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన పీవీ రమేష్ కు ప్రభుత్వ వర్గాల్లో సమర్ధుడిగా మంచి పేరుంది. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా బాధ్యతలు నిర్వర్తించిన క్లీన్ రికార్డు ఆయనది. గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల్లో ఆయన కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. దీంతో సహజంగానే జగన్ సర్కార్ గతేడాది ఆయన్ను సీఎంవో బాధ్యతల్లోకి తీసుకుంది. కానీ ఏడాది తిరగ్గానే ఆయన బాధ్యతల్లో కోతపెట్టారు. దీన్ని పీవీ రమేష్ అవమానంగా భావించారా, అందుకే అందివచ్చిన ట్వీట్ రూపంలో అసంతృప్తి వెళ్లగక్కారా అన్న ప్రచారం జరుగుతోంది. అంతకుముందు ప్రభుత్వం తరఫున ప్రత్యర్ధులతో సోషల్ మీడియాలో వార్ చేసిన ఆయన .. తన తాజా ట్వీట్ తో ప్రభుత్వంపై గురి పెట్టడం వెనుక అసలు కారణం ఏమై ఉంటుందన్న చర్చ కూడా జరుగుతోంది.
Recommended Video
ఒత్తిడి పెంచుతున్నారా ?
తాజాగా పీవీ రమేష్ బాధ్యతల్లో కోత పెట్టినా ఆయన్ను సలహాదారు పదవి నుంచి మాత్రం ప్రభుత్వం తప్పించలేదు. ఇలాంటి తరుణంలో పీవీ రమేష్ తన తాజా ట్వీట్ తో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారా అనే చర్చ కూడా సాగుతోంది. పీవీ రమేష్ తో పాటు మరో ఇద్దరు సలహాదారులు అజేయ కల్లం, మురళిని కూడా ప్రభుత్వం ఇదే విధంగా బాధ్యతల నుంచి తప్పించింది. వీరికి మరో కీలక బాధ్యత అప్పగిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇలాంటి తరుణంలో పీవీ రమేష్ చేసిన ట్వట్ ఐఏఎస్ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. ఈ ట్వీట్ జగన్ తదుపరి నిర్ణయంపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.