సిఎంకే నకిలీ లేఖ...ఐఎఎస్ ల సంఘం పేరుతో...కలకలం...
అమరావతి:ఆంధ్ర ప్రదేశ్ లో చోటుచేసుకుంటున్న కొన్నిపరిణామాలు విస్మయం కలిగిస్తున్నాయి. అసలు వ్యక్తులకే తెలియకుండా వారి పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న తంతు ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది. తాజా ఎపిలో జరిగిన ఓ ఘటన అందర్నీ నివ్వెరపోయేలా చేసింది...వివరాల్లోకి వెళితే...
ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఐఏఎస్ అధికారుల సంఘం పేరుతో ఏకంగా ఒక నకిలీ లేఖను సిఎం చంద్రబాబుకే పంపించారు. ఈ లెటర్ సోషల్మీడియాలో వైరల్గా మారి చర్చనీయాంశం అయింది. ఎంత ఐఎఎస్ లైతే మాత్రం ఇలా పబ్లిక్ గా లెటర్ రిలీజ్ చెయ్యడమేమిటని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ చివరికది ఫేక్ లెటర్ అని తేలి ఆశ్చర్యపోయారు. ఈమధ్య ఇలా కూడా జరుగుతున్నాయా అని విచిత్రంగా చెప్పుకుంటున్నారు. పైగా సిఎం కి పంపించిన లెటర్ ఆయనకు వ్యతిరేకంగానే ఉండటం కొసమెరుపు.

ఇటీవల చంద్రబాబు జన్మభూమి కార్యక్రమంలో
మాట్లాడుతూ...మార్చి 31నాటికి వందశాతం మరుగుదొడ్లను నిర్మించని జిల్లాల్లో కలెక్టర్లకు వ్యతిరేకంగా ధర్నా చేస్తానని...అప్పటికైనా వారికి రోషం వస్తుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే విషయమై ఐఏఎస్ అధికారుల సంఘం పేరుతో సీఎంకు ఒక లేఖ అందింది.

ఆ లెటర్ లో ...ఏముందంటే...
ఆ లెటర్ లో సిఎం నుద్దేశించి ఏమని రాసారంటే...అయ్యా శ్రీకాకుళంలో స్వచ్చభారత్ కార్యక్రమంలో మీరు చేసిన వ్యాఖ్యలు మమ్నలి బాధించాయని...అందుకే కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురాదలచామని...తమలో లోపాలుంటే బదిలీ చెయ్యండి...కానీ ఈ విధంగా నిందించటం తగదంటూ పేర్కొన్నారు. అంతేకాదు...అందులో మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి నిధుల కేటాయింపు వివరాలను సైతం క్రోడీకరించడం గమనార్హం.

మరుగుదొడ్ల నిధులు...దుర్వినియోగం అంటూ...
ఇంకా ఆ లేఖలో ఈ విధంగా పేర్కొన్నారు...మీ నాయకులు ఎలాంటి పనులు చేపట్టకుండానే బిల్లులు కోసం మామీద ఒత్తిడి తీసుకొస్తున్నారని, ముందు వారిని నియంత్రించాలని...అలాగే జన్మభూమి కమిటీ సభ్యులు, కమీషన్ తీసుకోకుండా పనిచెయ్యమని చెప్పాలని సిఎంను కోరుతున్నామన్నారు. మరో పేరాలో మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్రం విడుదల చేసింది రూ.992.06 కోట్లు, రాష్ట్రప్రభుత్వం విడుదల చేసింది 838.16 కోట్లు. మొత్తం 1830.22కోట్లలో కేవలం 1230.22 కోట్లు ఖర్చుచేశారు. మిగతా నిధులను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు దుర్వినియోగం చేశారు అని అందులో పేర్కొనడం సంచలనం సృష్టిస్తోంది.

ఐఎఎస్ అధికారుల ఖండన...
అయితే ఆ లేఖ నకిలీదని, తమ సంఘం లెటర్హెడ్ను నకిలీది ముద్రించి చేశారని, ముఖ్యమంత్రికి తాము ఎలాంటి లేఖ రాయలేదని ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఎల్.వి.సుబ్రహ్మణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారుల సంఘం చంద్రబాబు తీరుపై ఘాటు లేఖాస్త్రం సంధించిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అది పూర్తిగా అవాస్తవం. మా సంఘం ఎలాంటి లేఖా రాయలేదు...అని ఎల్.వి.సుబ్రహ్మణ్యం ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ఎవరు చేసి ఉంటారు?...
సాక్షాత్తూ సిఎం కే ఇలా ఐఏఎస్ అధికారుల సంఘం నకిలీ లేఖ పంపడం కలకలం రేపుతోంది. కొందరేమో దీనివెనుక గ్యారెంటీగా కొందరు ఐఏఎస్ అధికారుల హస్తం ఉండే ఉంటుంది...లేకుంటే ఈ మరుగుదొడ్ల నిధుల వివరాలు అంత ఖచ్చితంగా ఎలా రాయగలుగుతారని అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో ప్రతిపక్షం వైసిపి మద్దతుదారులు ప్రభుత్వం పై బురద జల్లడానికి ఈ విధంగా లేఖ రాసి సిఎంకి,సోషల్ మీడియాకి పంపివుంటారు...అని విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం పై బురద జల్లేందుకు ప్రయత్నించిన ఈ తరహా డూప్లికేట్ గాళ్లని టెక్నాలజీ వినియోగించైనా ఇలా ఈ లెటర్ ఎక్కడినుంచి వచ్చిందో, ముందుగా ఎక్కడ పోస్ట్ చేయబడిందో తెలుసుకొని వారిని కఠినంగా శిక్షించాలని టిడిపి నేతలు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications