చంద్రబాబుతో కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో భేటీ:కలకలం రేపుతున్న సమావేశం
అమరావతి:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో దేశ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ రాజీవ్ జైన్ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం కాగా టిడిపి శ్రేణుల్లో కలకలం రేపుతోంది. బీజేపీతో తెగతెంపుల నేపథ్యంలో ఎపిలోని టీడీపీ ప్రభుత్వం అవినీతిపై కేంద్రం చర్యలు తీసుకోనుందంటూ ముమ్మరంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా చోటుచేసుకున్నఈ పరిణామం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ రాజీవ్ జైన్ అనూహ్యంగా సిఎం చంద్రబాబు నివాసానికి రావడం...ఆ వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం కావడం రాజకీయవర్గాల్లో పెను ప్రకంపనలు రేపింది. బుధవారం ఉండవల్లిలోని సిఎం నివాసంలో సిఎం-ఐబి డైరెక్టర్ ల సమావేశం దాదాపు గంటన్నరపాటు జరిగినట్లు సమాచారం. అంతేకాదు ఈ భేటీ ముందస్తు షెడ్యూల్లో పొందుపరిచిలేకపోవడం వల్ల ఇది అనూహ్యంగా జరిగిన సమావేశమని భావిస్తున్నారు.
ఐబి డైరెక్టర్ తో జరిగిన ఈ భేటీలో సిఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారాయణ కూడా పాల్గొన్నారట. సిఎంతో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ సమావేశం అంటే కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే అయిఉంటుందని, అయితే ఈ భేటీకి కారణాలు ఏమిటనేది ఎపి ప్రభుత్వం వైపు నుంచి కాని లేక టిడిపి ముఖ్యుల నుంచి కానీ అధికారికంగా సమాచారం లేకపోవడంతో ఇదేదో ముఖ్యమైన అంతర్గత అంశాలపైన చర్చేనని మిగిలిన రాజకీయ పక్షాలు భావిస్తున్నాయి.
అయితే సిఎంతో రాజీవ్ జైన్ భద్రతా అంశాలపై చర్చించారని, సిఎం ఆయనకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ, మౌలిక సదుపాయాల, విజయాల గురించి ఆయనకు వివరించారని కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. అయితే అసలు విషయం అది అయి ఉండదని ఇది టిడిపి ప్రభుత్వకు అనుకూలమైన విషయం అయి ఉంటే వెంటనే అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించుకొని ఉండేవారని, అయితే అలాంటిదేమీ లేదు కాబట్టి ప్రతికూల విషయమే అయిఉంటుందని కొందరు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.