జగన్ సర్కార్కు డెడ్లైన్: అసెంబ్లీలో తీర్మానం చేయకపోతే రాజీనామా చేస్తా: వైసీపీ ఎమ్మెల్యే అల్టిమేటం
గుంటూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గుంటూరు తూర్పు శాసన సభ్యుడ ముస్తఫా సొంత ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. డెడ్లైన్ కూడా విధించారు. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ జనాభా రిజిస్టర్ కార్యక్రమాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో జరగబోయే శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ మేరకు తీర్మానాన్ని ప్రవేశపెట్టి, ఆమోదించాలని అన్నారు. అలా చేయకపోతే తాను రాజీనామా చేస్తాననీ హెచ్చరించారు.
తన నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన మైనారిటీల సింహగర్జన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. భారత్లో నివసించే ముస్లింల మనుగడను ప్రశ్నార్థకం చేసేలా కేంద్ర ప్రభుత్వంఈ రెండు చట్టాలను ప్రవేశ పెట్టిందని ఆరోపించారు. మతాలవారీగా ప్రజలను విడగొట్టే ఇలాంటి చట్టాలను తమ రాష్ట్రంలో అమలు చేయకూడదని ఆయన చెప్పారు. ముస్లింల మనోభావాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాంటి వివాదాస్పద చట్టాలను రాష్ట్రంలో అమలు చేయబోరని ఆయన హామీ ఇచ్చారు. ఆ నమ్మకం తనకు ఉందని చెప్పారు.
Recommended Video

పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ జనాభా రిజిస్టర్ కార్యక్రమాలకు తమ ప్రభుత్వం వ్యతిరేకమని ఆయన తేల్చి చెప్పారు. దీనికోసం కేంద్రాన్ని ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను తాము ఒప్పిస్తామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కూడా గతంలో ఇదే హామిని ఇచ్చారని ముస్తఫా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ రెండు వివాదాస్పద చట్టాలను రాష్ట్రంలో అమలు చేయబోమంటూ వారిద్దరూ స్పష్టం చేశారని, దాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications