ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చిన జైరాం రమేశ్, దిగ్విజయ్ సింగ్
అమరావతి: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ తెలిపారు. త్వరలో ఏపీకి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రవేశించనున్న నేపథ్యంలో కర్నూలులో కాంగ్రెస్ కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జైరాం రమేశ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు దేశ వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందన్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో పూర్తి చేసుకుని.. అక్టోబర్ 18న ఏపీలోకి పాదయాత్ర ప్రవేశిస్తుందన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన ఆలూరు నియోజకవర్గం నుంచి మంత్రాలయం వరకు నాలుగు రోజులపాటు 95 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగుతుందన్నారు.
ఆ తర్వాత తెలంగాణలో 13 రోజులపాటు యాత్ర జరుగుతుందని జైరాం రమేష్ తెలిపారు. మరో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. 2024లో అధికారంలో రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆ బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు.
ఇక బీజేపీపై విమర్శలు చేస్తూ.. దేశంలో కుల, మతాల మధ్య బీజేపీ చిచ్చుపెడుతోందని ఆరోపించారు దిగ్విజయ్ సింగ్. విభజించు, పాలించు అనే నినాదంతో ఆ పార్టీ పాలన సాగిస్తోందన్నారు. ఈ సమావేశంలో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ ఉమెన్ చాందీ, ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నేతలు తులసిరెడ్డి, హర్షకుమార్, కర్నూలు, నంద్యాల జిల్లాల పార్టీ అధ్యక్షులు, నేతలు పాల్గొన్నారు.