'అవసరమైతే హైదరాబాద్లో ఏపీ పోలీస్ స్టేషన్లు': ఓటుకు నోటుపై రాజ్నాథ్ నో
హైదరాబాద్: అవసరమైతే హైదరాబాదులో ఏపీ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రులు హెచ్చరిస్తున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతలు చవటలు, దద్దమ్మలు అని మండిపడ్డారు.
ఏపీ సర్కార్ సహనాన్ని తెలంగాణ ప్రభుత్వం తక్కువగా అంచనాలు వేసిందన్నారు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి తమ వద్ద అన్ని రకాల రికార్డులు, ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఫోన్లు ట్యాప్ చేయలేదని తెలంగాణ ప్రభుత్వం రాతపూర్వకంగా ఏపీకి చెప్పగలదా అని సవాల్ చేశారు.
ఏసీబీని అడ్డుపెట్టుకొని చంద్రబాబును భయపెట్టాలని చూస్తున్నారని అన్నారు. అవసరమైతే హైదరాబాదులో ఏపీ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాదు పైన తెలంగాణ ప్రభుత్వానికి ఎంత హక్కు ఉందో, తమకూ అంతే హక్కు ఉందన్నారు.
ఎన్టీఆర్ భవన్ వద్ద భారీ భద్రత

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏపీ సాయుధ బలగాలని దించారు.
గవర్నర్తో ఏపీ డీజీపీ, సీఎస్ భేటీ
గవర్నర్ నరసింహన్తో ఏపీ డీజీపీ జేవీ రాముడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్ కృష్ణారావులు భేటీ అయ్యారు. ఓటుకు నోటు కేసు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్, చంద్రబాబుకు నోటీసులు జారీ చేయడానికి తెలంగాణ ఏసీబీ సిద్ధంగా ఉందనే ప్రచారం నేపథ్యంలో వాటిపై చర్చించారని సమాచారం.
అదే సమయంలో తమకు తెలంగాణ పోలీసులు అవసరం లేదని, ఏపీ పోలీసులతో భద్రత చూసుకుంటామని చెప్పారని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన ఆధారాలున్నట్లు కూడా చెప్పినట్లుగా సమాచారం.
ఓటుకు నోటుపై రాజ్ నాథ్ సింగ్ నో
ఓటుకు నోటు వ్యవహారం పైన తాను మాట్లాడనని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సెక్షన్ 8 సహా అన్ని వివాదాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి పరిశీలిస్తారని చెప్పారు.












Click it and Unblock the Notifications