'ఆ నలుగురు' ఉంటే అధికారం టీడీపీదే!! పార్టీలో విశ్లేషణ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగడానికి ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ అన్ని పార్టీలు ఇప్పటినుంచే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య పోటీ హోరాహోరీగా ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. ఇటువంటి వాతావరణం మధ్యలో ఓటర్లలో తమకు అనుకూలంగా ఉండేవారెవరు? తటస్థంగా ఉండేవారెవరు? దూరంగా ఉండేవారెవరు.. ఉంటే ఎందుకు దూరంగా ఉంటున్నారు? న్యూట్రల్ ఓటర్లను తమ పార్టీవైపు ఎలా తిప్పుకోవాలి? తదితర అంశాలపై ఇప్పటినుంచే పార్టీలన్నీ పోస్టుమార్టం మొదలుపెట్టాయి.

గతంలో ఎక్కడ తేడా కొట్టింది?
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గత ఎన్నికల్లో ఎక్కడ తేడా జరిగింది? టీడీపీ-వైసీపీ మధ్య సీట్ల అంతరం పెరగడానికి ప్రధాన కారణం ఏమిటి? సమాజంలో ఏ వర్గాలను దరిచేర్చుకుంటే అధికారం చేజక్కించుకోవచ్చు అనే అంశాలపై తీక్షణంగా శోధిస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలవల్ల లబ్ధిదారులంతా తిరిగి ఆ పార్టీకే ఓటు వేస్తారనే నమ్మకంతో వైసీపీ ఉంది. ఆ పథకాలవల్ల లబ్ధిపొందనివారు ఎంత మంది ఉంటారు? ఈ పథకాలమీద వారి అభిప్రాయం ఏమిటి? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అందరికీ అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పడంవల్ల
ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడానికి దోహపడుతుందని భావిస్తున్నారు.

ఓటింగ్ కు తీసుకురాగలిగితే చాలు..
ఈ పథకాలవల్ల లబ్ధి పొందినవారు తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారా? లేదా? అనే మీమాంస టీడీపీలో ఉంది. ఎగువ మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి, ఉన్నతాదాయవర్గం, న్యూట్రల్ ఓటర్లు.. ఈ నాలుగువర్గాలవారిపై చంద్రబాబునాయుడు దృష్టిసారించారు. వీరిలో ఉన్నతాదాయ వర్గం, ఎగువ మధ్యతరగతి ఓటింగ్ కు రారని, వీరిని ఓటింగ్ వరకు తీసుకువస్తే విజయం సొంతమవుతుందని నియోజకవర్గ నేతలతో సమావేశమైనపపుడల్లా చంద్రబాబు పదే పదే వారికి చెబుతున్నారు. మధ్యతరగతి మొత్తాన్ని తెలుగుదేశం పార్టీవైపు తిప్పాలని, వీరికి రాష్ట్ర రాజకీయాలపై పూర్తి అవగాహన ఉంటుందని, ధరలు పెరిగినా, పథకాలు ఆగిపోయినా మొదటగా ఇబ్బందులు ఎదుర్కొనేది మధ్యతరగతి అని పార్టీలో విశ్లేషించారు. వారిని టీడీపీవైపు తిప్పుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నారు.

న్యూట్రల్ ఓటర్లపైనే దృష్టి
అన్నిటికన్నా ఎన్నికల్లో ఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నా, ఏ పార్టీ అధికారానికి దూరమవ్వాలన్నా న్యూట్రల్ ఓటర్లే కారణమని పార్టీ భావిస్తోంది. అందుకే తటస్థంగా ఉండే ఓటర్లంతా ఈసారి తెలుగుదేశం పార్టీవైపు మొగ్గుచూపే అవకాశం ఉందని, అందుకనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో న్యూట్రల్ ఓటర్లు ఉండే ప్రాంతాలను గుర్తించాలని, రాష్ట్రాభివృద్ధి ఎలా ఆగిపోయింది? చంద్రబాబు ఉంటే ఎలా అభివృద్ధి చెందుతుంది? తదితర విషయాలపై చర్చలు నిర్వహించి ఆ సమావేశాలకు వీరిని ఆహ్వానించాలని నిర్ణయించారు. ఇలా ఈ నాలుగు వర్గాలను దరిచేర్చుకుంటే అధికారం సులువుగా దక్కుతుందనే అభిప్రాయం ఆ పార్టీలో వెల్లడవుతోంది.












Click it and Unblock the Notifications