మరో 30 ఏళ్లు మనల్ని ఎవరూ కదిలించలేరు.. కానీ: జగన్ కు అదొక్కటే అడ్డంకి
అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. 175 నియోజకవర్గాలను క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలను ప్రదర్శిస్తోంది. ఈ దిశగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోన్నారు. అభ్యర్ధుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోన్నారు. క్లీన్ స్వీప్ ను లక్ష్యంగా పెట్టుకున్నందున అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయన రాజీపడట్లేదు.

ఎమ్మెల్యేల పనితీరుపై..
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ చేపట్టిన గడప గడపకూ మన ప్రభుత్వం ద్వారా ప్రజల నుంచి నేరుగా అందే ఫీడ్బ్యాక్ను వైఎస్ జగన్ దీనికి ప్రాతిపదికగా తీసుకుంటోన్నారు. ఎమ్మెల్యేల పనితీరును బేరీజు వేయడానికి, పరిపాలన- సంక్షేమ పథకాల అమలుపై ప్రజాభిప్రాయాలను సేకరించడానికి ఈ కార్యక్రమం దోహదపడుతోందని భావిస్తోన్నారు. భవిష్యత్లో వాటి ఆధారంగానే టికెట్లను కేటాయించే అవకాశాలు లేకపోలేదు.

విజయవాడ తూర్పు భేటీ..
ఈ పరిణామాల మధ్య తాజాగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ ఏర్పాటైంది. ఇందులో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గం ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ సహా పలువురు నాయకులు దీనికి హాజరయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించితే- ఇంకో 30 సంవత్సరాల పాటు తామే అధికారంలో ఉంటామని తేల్చి చెప్పారాయన.

16 నెలల్లో..
రాష్ట్రంలో మరో 15-16 నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయని, ఇప్పటి నుంచే దీనికి సన్నద్ధం కావాలని వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం పార్టీ సిట్టింగ్స్ స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉందని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం తమది కాకపోయినప్పటికీ- 88 శాతం మంది ప్రజలకు సంక్షేమ పథకాల లబ్దిని అందించామని వివరించారు. కులం, మతం, ప్రాంతాలతో పాటు పార్టీలకు అతీతంగా పని చేస్తోన్నామని, ఇలాంటప్పుడు ఎందుకు గెలవలేమని ప్రశ్నించారు.

మెజారిటీ వార్డులు..
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో మెజారిటీ వార్డులను తాము గెలుచుకున్నామని జగన్ గుర్తు చేశారు. 21 వార్డులకు 14 చోట్ల విజయం సాధించామని, అవే ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రతిఫలించాలని సూచించారు. నియోజకవర్గం స్థాయిలో విభేదాలు ఉంటే వాటిని సత్వరమే పరిష్కరించుకోవాలని, అందర్నీ కలుపుకొని పోవాలని అన్నారు. మిగిలిపోయిన లబ్దిదారులకు కూడా సంక్షేమ పథకాలను అందజేసేలా చూడాలని చెప్పారు.












Click it and Unblock the Notifications