కలెక్షన్లే ముఖ్యమనుకుంటే టికెట్ గురించి మర్చిపోండి:ఎమ్మెల్యేలకు సిఎం చంద్రబాబు వార్నింగ్
అమరావతి:ఎన్నికలు అంతకంతకు దగ్గరవుతున్న నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు పార్టీ ప్రక్షాళనా చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. ఆ క్రమంలో ఎమ్మెల్యేలతో భేటీల సందర్భంగా సిఎం చంద్రబాబు చేస్తున్న సూటైన హెచ్చరికలు శాసన సభ్యుల గుండెల్లో గుబులు రేపుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే శాసన సభ్యుల పనితీరు గురించి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్న చంద్రబాబు పనితీరు బాగోలేని వారిని మాత్రం నిర్మొహమాటంగా దులిపేయడం...వార్నింగ్ ఇవ్వడం చేస్తున్నారని తెలిసింది. అయితే బాగా పనిచేస్తున్నట్లుగా రిపోర్టు ఉన్న వారిని భుజం మాత్రం తట్టి అభినందిస్తున్నారని సమాచారం. అయితే లోపల ఆయన ఏమన్నప్పటికీ ఎమ్మెల్యేలు బైటకువచ్చి మాత్రం తమ పనితీరు మీద అధినేత సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పుకుంటున్నారట.

ఆ సినిమాల్లో...సీన్లు కనిపిస్తున్నాయి
శివాజీ,నాయక్ సినిమాల్లో ప్రజాప్రతినిధులను అభివృద్ది పనుల కోసం బలవంతంగా సంతకాలు చేయించడం వగైరాలు పూర్తయ్యాక వారు బైటకు వచ్చి తమకు ఏమి జరిగిందో బైట ఉన్నవారికి చెప్పకుండా వారిని కూడా లోపలకు పంపించే దృశ్యాలు ప్రేక్షకులను బాగా అకట్టుకున్నాయి. ఇప్పుడు తమ పార్టీ ఎమ్మెల్యేలతో టిడిపి అధినేత చంద్రబాబు ముఖాముఖి సమావేశాల సందర్భంగా అదే తరహా సీన్లు అక్కడ కనిపిస్తున్నాయట. అదెలాగంటే?...

లోపల...ఎమ్మెల్యేతో చంద్రబాబు
‘‘మీరు సంతకం చేసిస్తే తప్ప పని చేసేది లేదని ఎమ్మార్వో చెబుతున్నారంట...ధరఖాస్తుదారులు ఇక చేసేదేమీ లేక మీ ఇంటికి వస్తే మీ మనుషులు బేరాలు పెడుతున్నారట...ఇదేం వ్యవహారం?...ఎమ్మార్వో కార్యాలయంలో పనులతో మీకేం సంబంధం?...మీకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించింది ఇందుకేనా?...మీరు అవినీతిని పెంచుతున్నారా, తగ్గిస్తున్నారా"...ఇదీ ఒక రాయలసీమ టిడిపి ఎమ్మెల్యేతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ముచ్చటించిన తీరు. సిఎం ఇంత స్ట్రయిట్ గా అడిగేప్పటికి సమాధానం చెప్పలేక ఆ ఎమ్మెల్యే నీళ్లు నమిలారట...

వీరికి ఇలా...వార్నింగ్
రాయలసీమకు చెందిన ఒక ఎమ్మెల్యేతో భేటీ సందర్భంగా చంద్రబాబు ఆయన్ను హెచ్చరిస్తూ...కలెక్షన్లే ముఖ్యమనుకుంటే మీరు ఈసారి టికెట్ గురించి మరిచిపోవచ్చు....ఆ వ్యవహారాలు పూర్తిగా నిలిపివేసి ప్రజల్లో మంచిపేరు తెచ్చుకుంటేనే మరోసారి అవకాశం ఇవ్వగలం...అని ముఖం మీదే చెప్పేశారట. అలాగే
ఉత్తరాంధ్రకు చెందిన మరో నాయకుడితో మాట్లాడుతూ...భూముల వ్యవహారాలు మొదలుకొని ప్రతి దానిలో మీ పేరు వినిపిస్తోంది...ఇంకా ఆరు నెలలు సమయం ఉంది. తప్పులు దిద్దుకొంటే మంచిది. లేకపోతే తర్వాత బాధ పడాల్సి ఉంటుందని చెప్పేశారట.

ఇలాగే...ఇంకొందరికి క్లాస్
ఉత్తరాంధ్రకు చెందిన ఒక ఎమ్మెల్యేతో...‘‘మీ జిల్లాలో ఏ ఎమ్మెల్యేపైనా రానన్ని ఆరోపణలు మీపై వస్తున్నాయి...ఏ సర్వే చూసినా మైనస్ లోనే ఉంటోంది...చరిత్ర కలిగిన రాజకీయ కుటుంబం నుంచి వచ్చి ఇలాంటి పేరు తెచ్చుకోవడం ఏమిటి?...భూములతో మొదలుకొని ప్రతి దానిలో మీ పేరు వినిపిస్తోంది...తప్పులు దిద్దుకొంటే మంచిది. లేకపోతే తర్వాత బాధపడాల్సి ఉంటుంది''...అని సిఎం సూటిగా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను ఉద్దేశించి మీరు మీ నియోజకవర్గాలు వదలిపెట్టి విజయవాడలో మకాం వెయ్యడం ఏమిటి?...ఉదయం 9.30 వరకూ ఎవరికీ ఫోన్లో దొరకరు. తక్షణం మీ పని తీరును మార్చుకోండి అని హెచ్చరించారట.

మరికొందరితో...ఏమన్నారంటే?
ఒక నియోజకవర్గ ఇన్చార్జి చేతిలో ఇరవై మంది గ్రామ స్థాయి నాయకులతో కూడిన జాబితాను పెట్టిన చంద్రబాబు...వీళ్లంతా నీకు దూరంగా ఉంటున్నారు...పార్టీలో ఉన్నవారందరినీ కలుపుకోగలిగితేనే గెలవగలుగుతావు...లేదంటే ఏమవుతుందో చెప్పక్కర్లేదు...అని సూటిగా చెప్పేశారట. దక్షిణ కోస్తా కు చెందిన ఒక ఎమ్మెల్యేతో మాట్లాడుతూ వ్యక్తిగతంగా నువ్వంటే నాకు అభిమానమని...కానీ, నీ నియోజకవర్గంలో పరిస్థితి ఏమాత్రం బాగోలేదని...కాబట్టి మరో నియోజకవర్గానికి మారతావా?...దీనికి నువ్వు అనుకొంటున్న ప్రత్యమ్నాయాలు ఏమిటి?...అని సిఎం ఆయనను అడిగేశారట. అందుకు సమాధానంగా ఆ ఎమ్మెల్యే చెప్పిన విషయాలు నోట్ చేసుకొన్నారట.

కొందరికి...ప్రసంసలు,హామీలు కూడా
అయితే ఈ ముఖాముఖీ భేటీల్లో కేవలం వార్నింగ్ లే కాదట...బాగా పనిచేస్తున్న ఎమ్మెల్యేలు కొందరిని అధినేత చంద్రబాబు నేరుగానే ప్రశంసించారట. గుంటూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే పనితీరును ఆయన బాగా మెచ్చుకున్న ఆయన...‘‘నీమీద రిమార్కులు ఏమీ లేవు...ఇంకా బాగా పని చేసుకో"...అని చెప్పారట. ఇదే క్రమంలో తమ నియోజకవర్గాల్లో ప్రజాదరణ మెండుగా ఉన్న ఎమ్మెల్యేలకు సీటు మళ్లీ మీకే అనే విషయం చూచాయగా చెప్పి పంపుతున్నారట. అయితే లోపల అధినేత తెగిడినా...పొగిడినా ఎమ్మెల్యేలు బైటకు వచ్చాక మాత్రం..."లోపల నన్ను సీఎం అభినందించారు...మరింత బాగా పనిచేసుకొమ్మని చెప్పారు"...అని చెప్పుకొని వెళ్లిపోతున్నారట.

ప్రాంతాల వారీగా...వరుస భేటీలు
ఇలా ప్రాంతాల వారీగా ఎమ్మెల్యేలు పిలిపించి సిఎం నేరుగా తన వద్ద ఉన్న ఫీడ్ బ్యాక్ ఇచ్చి హెచ్చరికలు,సూచనలు ఇచ్చి పంపుతున్నట్లు తెలిసింది.
ఇలా ఒక్కో ఎమ్మెల్యేకు సుమారు అరగంట సమయం అధినేత కేటాయిస్తున్నారట. ప్రస్తుతం పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలతో చంద్రబాబు ముఖాముఖి భేటీలు నిర్వహిస్తున్నారని తెలిసింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ వరకూ ఈ భేటీలు పూర్తయ్యాయని...ఇటీవలే కోస్తా ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలతో సమావేశాలు మొదలు పెట్టారని తెలిసింది. రాజకీయంగా విస్తృత అవగాహన ఉందనుకొన్న ఎమ్మెల్యేలతో వారి పక్క నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితి, ఓటర్ల మనోగతం, ప్రభు త్వ పథకాల అమలు తీరు వంటి వాటిపై కూడా చర్చిస్తున్నారట. మొత్తానికి పార్టీ అధినేత చంద్రబాబు ఈ భేటీలను నిర్వహిస్తున్న తీరు టీడీపీలో హాట్ టాపిక్గా మారినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications