ముంచుకొస్తున్న తుఫాన్, వర్షాలు మొదలు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..!!
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో సోమవారం దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. తదుపరి 48 గంటల్లో ఇది మరింతగా బలపడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ప్రభావంతో నేటి నుంచి మూడు రోజుల పాటు పలు కోస్తా, సీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
మొదలైన వర్షాలు
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆదివారం ఉత్తర తమిళనాడు పరిసరాల్లో ఆవరించి ఉంది. ఇక రెండు రోజుల క్రితం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో సోమవారం దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ అల్పపీడనం బలపడి దక్షిణకోస్తా, ఉత్తర తమిళనాడు దిశగా రానున్న క్రమంలో ఈ నెల 15 నుంచి 17 వరకు కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

అప్రమత్తంగా ఉండాలి
వచ్చే 4 రోజులు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా వెల్లడించారు. ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నట్లు చెప్పారు. ఇవాళ కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందన్నారు. 17వ తేదీ వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీవర్షాలు, తీరం వెంబడి 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు.
ప్రభుత్వం అలర్ట్
అల్లూరి సీతారామరాజు, ఏలూరు, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, తేలికపాటి వర్షాలు కురుస్తాయని సిసోదియా తెలిపారు. వచ్చే 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని జిల్లాలతో పాటు రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్లు ఏర్పాటుచేయాలని సిసోడియా సూచించారు. ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, పల్నాడు, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సిసోడియా సూచించారు.












Click it and Unblock the Notifications