రుతుపవనాల పై వాతావరణ శాఖ తాజా అప్ డేట్..!!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. సాయంత్రం వేళ వర్షాలు పడుతున్నాయి. భిన్న వాతావరణ పరిస్థితుల్లో రుతుపవనాలకు సంబంధించి గుడ్ న్యూస్ వచ్చింది. రానున్న మూడు రోజుల్లో హైదరాబాద్ త సహా తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలోని 97 మండలాల్లో వడగాల్పులపై విపత్తుల శాఖ అప్రమత్తం చేసింది. మరో రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలతో పాటుగా వడగాల్పులపైన హెచ్చరికలు జారీ చేసింది.
జూన్ 4 నాటికి రుతుపవనాలు: ఈ ఏడాది రుతుపవనాల పైన వాతావరణ శాఖ స్పష్టత ఇచ్చింది. జూన్ 1కి రుతుపవనాలు భారత్ను తాకే అవకాశం లేదని, 4వ తేదీ నాటికి కేరళకు వస్తాయని వాతావరణ సంస్థ పేర్కొన్నది. రానున్న రెండు రోజుల్లో రుతుపవనాలు సానుకూలంగా ముందుకు సాగేందుకు అనుకూల పరిస్థితులు నెలకొంటాయని తెలిపింది.

ఈ ఏడాది రుతుపవన సమయంలో హిందూ మహాసముద్రంలో అభివృద్ధి చెందే సానుకూల ఇండియన్ ఓషియన్ డైపోల్(ఐవోడీ) ఎల్నినో ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తుందని, తద్వారా దేశంలో సాధారణ వర్షాలు పడుతాయని పేర్కొన్నది. జూన్-సెప్టెంబర్ మధ్య 96 శాతం వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ మంచి వర్షాలే పడుతాయని పేర్కొన్న ఐఎండీ.. వాయవ్య భారత్లో కొద్దిగా తక్కువగా వర్షపాతం ఉంటుందని అంచనా వేసింది.
రాష్ట్రంలో పొడి వాతావరణం: తెలంగాణలో రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 29, 30 తేదీల్లో రాష్ట్రంలో తేలికపా టి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడు రోజులు పగటి ఉష్ణోగ్రతలు 39 నుంచి 44 డిగ్రీల మధ్య, జీహెచ్ఎంసీ పరిధిలో 37 నుంచి 39 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది.
శుక్రవారం పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 43.9 డిగ్రీలు, హైదరాబాద్లోని గచ్చిబౌలిలో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యాయి. ఏపీలో ఈ రోజు 97 మండలాల్లో వడగాల్పులు, రేపు 4 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 47 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల శాఖ అంచనా వేసింది.
వడగాల్పుల హెచ్చరిక: ఈ రోజు ఈరోజు అల్లూరి2, అనకాపల్లి 1, బాపట్ల 7, తూర్పుగోదావరి 7, పశ్చిమగోదావరి 3, ఏలూరు 4 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. గుంటూరు 17, కాకినాడ 9, కోనసీమ 10,కృష్ణా 15, ఎన్టీఆర్ 8,పల్నాడు 9, మన్యం 4, వైయస్సార్ జిల్లాలోని ఒక మండలంలో వడగాల్పులు వీస్తాయని విపత్తుల శాఖ వెల్లడించింది. మిగిలిన చోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
శుక్రవారం తిరుపతి జిల్లా రేణిగుంటలో 43.9, నెల్లూరు జిల్లా వెంకటాచలంలో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు ద్రోణి ప్రభావంతో 3 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురస్తాయని అంచనా వేసింది. నేడు మన్యం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications