మొదలైన వానలు, కానీ - వాతావరణ శాఖ తాజా అప్డేట్..!!
తెలుగు రాష్ట్రాలను తొలరి పలకరించింది. వాన జల్లులవల్ల రాష్ట్ర వాసులకు ఉపశమనం లభించినట్లైంది.గత కొంత కాలంగా ఎన్నడూలేని విధంగా ఎండలు మండాయి. పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరాయి. అప్పటివరకు వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనేక ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. రానున్న నాలుగు రోజుల వరకు కోస్తాలో విస్తారంగా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
వాతావరణంలో మార్పు:తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పు మొదలైంది. తొలకరి జల్లులతో భారీ ఉపశమనం దక్కింది. వేసవి తాపానికి అధిక ఉష్ణోగ్రతలకు, ఉక్కపోతలకు ఉక్కిరిబిక్కిరైన ప్రజలు నైరుతి రుతుపవనాల రాకతో సేదతీరారు. రాష్ట్ర వ్యాప్తంగా మబ్బులు కమ్ముకుని, చల్లని గాలులు వీస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతు పవనాలు బుధవారం ప్రవేశించాయి. వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల నిన్న తొలకరి జల్లులు కురిశాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో బుధవారం సాయంత్రం నుంచే వాన జోరుగా కురుస్తున్నది. గురువారం నాటికి తెలంగాణను నైరుతి తాకుతుందని వాతావరణ అధికారులు వెల్లడించినా ముందుగానే రాష్ట్రంలోకి రుతుపవనాలు వచ్చేశాయి.
ఉపరితల ఆవర్తనం:రాగల రెండు, మూడు రోజుల్లో దక్షిణ భారతదేశంలోని మరికొన్ని భాగాలకు నైరుతి విస్తరించే అవకాశాలున్నాయి. దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా వాయవ్య దిశ నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వీస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో సముద్రం నుంచి వచ్చే తేమగాలుల వల్ల బుధవారం కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు కురిశాయి. అన్నమయ్య, పల్నాడు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో అత్యధికంగా 120.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

అక్కడక్కడ భారీవర్షాలు:రానున్న నాలుగు రోజుల వరకు కోస్తాలో విస్తారంగా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు, మూడు రోజుల్లో దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఒడిశా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్ వరకు రుతుపవనాలు విస్తరిస్తాయని వివరించింది.
బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పలుచోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. మరోవైపు బుధవారం కోస్తా, రాయలసీమల్లోని పలుచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. బాపట్లలో 41.2, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 40.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం కంభంపాడులో 105, ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల మండలం మోగులూరులో 88, ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఈదరలో 79 మి.మీ. వాన కురిసింది.












Click it and Unblock the Notifications