ఏపీలో ఈ నెల 24 వరకూ తీవ్ర వడగాల్పులు- బయటికి రావొద్దంటూ ఐఎండీ హెచ్చరిక
ఏపీలో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉందని, రాబోయే మూడు రోజుల పాటు ఇదే పరిస్ధితి కొనసాగుతుందని భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 24 వరకూ ప్రజలు ఇళ్ల నుంచి బయటకి రాకపోవడమే మంచిదని ఐఎండీ సూచించింది. మరీ ముఖ్యంగా రేపటి నుంచి వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని ఐఎండీ పేర్కొంది.
ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా భానుడి ప్రతాపంతో జనం అల్లాడుతున్నారు. గుంటూరు జిల్లా రెంట చింతల సూర్య ప్రతాపంతో మూడు రోజులుగా అల్లాడుతోంది. నిన్న ఏకంగా 47.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న రాష్ట్రంలోని పలు చోట్ల 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా జంగమేశ్వరపురంలో 44, విజయవాడలో 43.5, మచిలీపట్నంలో 43.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఐఎండీ అమరావతి డైరెక్టర్ స్టెల్లా తెలిపారు.

రేపటి నుంచి ఆదివారం వరకు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ, యానాంలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. ముఖ్యంగా పిల్లలు, పెద్దలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. నీళ్లు, ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలని సూచించింది.












Click it and Unblock the Notifications