బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం- ఏపీని భారీ వర్షాలు ముంచెత్తనున్నాయా?
Heavy rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావం వల్ల కొద్దిరోజుల కిందటే ఏపీలో భారీగా వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో దంచికొట్టాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు విస్తారంగా వర్షలు పడ్డాయి. ప్రత్యేకించి- కోస్తాజిల్లాలపై దీని తీవ్రత అధికంగా కనిపించింది.
తాజాగా మళ్లీ అలాంటి పరిస్థితులే ఏర్పడ్డాయి. వాయవ్య బంగాళాఖాతంలో తాజాగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా సముద్ర మట్టానికి 1.5 నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తులో ఇది కొనసాగుతోంది. ఇది వచ్చే 24 గంటల వ్యవధిలో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు.

ఆ తర్వాత ఇది క్రమంగా దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం మీదుగా పశ్చిమ-వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. ఫలితంగా ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయనే అంచనాలు ఉన్నాయి. ఆ సమయంలో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.
ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల నేడు ఉత్తరాంధ్ర, ఏజెన్సీ ప్రాంత జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలియజేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
అలాగే- అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఇవే పరిస్థితులు తలెత్తుతాయి. పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అక్కడక్కడ పిడుగులు పడొచ్చని, సమయంలో బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద తలదాచుకోవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ఈదురు గాలులు వీచే సమయంలో ప్రజలు హోర్డింగులు, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి ప్రదేశాల వద్ద నిల్చోకూడదని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications