జగన్ ఇండిపెండెన్స్ డే షాక్-పతాకావిష్కరణకు సర్పంచ్ లు, ఎంపీటీసీలు దూరం-వారికే ఛాన్స్
ఏపీలో గ్రామ సచివాలయాల ఏర్పాటుతో ఇప్పటికే పంచాయతీ రాజ్ వ్యవస్ధ కల్పించిన అధికారాల్ని సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి లాగేసుకుంటున్న జగన్ సర్కార్ తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. రేపు జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లోనూ పతాకావిష్కరణ అవకాశాన్ని సైతం వారి నుంచి లాగేసుకుంది. పాఠశాల విద్యాకమిటీ ఛైర్మన్లకు ఈ అవకాశం కల్పించింది. దీంతో సర్పంచ్ లు, ఎంపీటీసీలు జగన్ సర్కార్ నిర్ణయంపై మండిపడుతున్నారు.ప్రభుత్వ ఆదేశాలు అమలైతే తాము ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
75వ స్వాతంత్ర దినోత్సవం
ఏపీలో రేపు 75వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్దమవుతోంది. ప్రభుత్వం ఈ మేరకు అన్ని జిల్లాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించేలా ఆదేశాలు కూడా ఇచ్చింది. సీఎం, మంత్రులు, అధికారులు ఎవరి స్ధాయిలో వారు జాతీయ జెండా ఆవిష్కరణకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో గ్రామాల్లో సర్పంచ్ లు, ఎంపీటీసీలకు మాత్రం జగన్ సర్కార్ షాకిచ్చింది. దీంతో వారికీ స్వాతంత్ర దినోత్సవం పీడకలలా మిగిలిపోనుంది. ప్రభుత్వ నిర్ణయం వారికి ఏమాత్రం మింగుడు పడటం లేదు. ఇప్పటికే సర్పంచ్ లపై అక్కసు చూపిస్తున్న ప్రభుత్వం తాజా నిర్ణయంపై మండిపడుతున్నారు.
సర్పంచ్ లు, ఎంపీటీసీలకు షాక్
ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరఫున సీఎం జగన్, మంత్రులు పతాకావిష్కరణలు చేస్తుండగా.. గ్రామాల్లో సర్పంచ్ లు, ఎంపీటీసీలు పాఠశాలలకు వెళ్లి జెండా ఎగరేయడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామాల్లో ఉండే పాఠశాలల్లో జెండా ఎగరవేయడాన్ని సర్పంచ్ లు, ఎంపీటీసీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు. కానీ ఇప్పుడు జగన్ సర్కార్ వారికి ఆ అవకాశం దూరం చేసేసింది. ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్కూళ్లలో జెండా ఆవిష్కరణకు సర్పంచ్ లు, ఎంపీటీసీలు జెండా ఎగరేయకుండా ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారికి ఈ ఆదేశాలు షాక్ గా మారాయి.
విద్యా కమిటీల ఛైర్మన్లకు ఛాన్స్
ఏపీలోని పాఠశాలల్లో ఈ ఏడాది జరిగే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఎగరవేసే అవకాశాన్ని ప్రభుత్వం సర్పంచ్ లు, ఎంపీటీసీల స్దానంలో స్కూళ్లలో విద్యాకమిటీల ఛైర్మన్లకు కట్టబెట్టింది. ఇప్పటివరకూ స్కూళ్లలో జరిగే అధికారిక కార్యక్రమాల్ని దగ్గరుండి చేయిస్తున్న వీరికే జెండా ఆవిష్కరణ అవకాశం కూడా ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యా కమిటీల ఛైర్మన్లతో జెండా ఆవిష్కరణలు చేయించాలంటూ విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు పంపింది. దీంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అధికారులు ఆయా సర్పంచ్ లు, ఎంపీటీసీలకు చేరవేస్తున్నారు. రేపు దయచేసి స్కూళ్లకు రావొద్దంటూ కోరుతున్నారు. దీంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
మండిపడుతున్న సర్పంచ్ లు
రాష్ట్రంలో తొలిసారిగా స్వాతంత్ర దినోత్సవం నాడు స్కూళ్లలో జెండా ఎగరవేసే అవకాశం కోల్పోవడంపై సర్పంచ్ లు, ఎంపీటీసీలు మండిపడుతున్నారు. ప్రభుత్వం తమకున్న హక్కుని లాక్కుని విద్యాకమిటీ ఛైర్మన్లకు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ ఏటా గ్రామాల్లోని స్కూళ్లలో జెండా తామే ఎగరేస్తున్నామని, అలాంటిది ఇప్పుడు ప్రభుత్వం ఏకపక్షంగా తమను దూరం పెట్టి విద్యాకమిటీలకు అవకాశం కల్పించడం దారుణమని సర్పంచ్ లు ఆక్షేపిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉన్న సర్పంచ్ లు, ఎంపీటీసీలకు అస్సలు మింగుడు పడటం లేదు. తాజాగా పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వైసీపీ సర్పంచ్ లు సైతం ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పంచాయతీరాజ్ ఛాంబర్ ఆగ్రహం
గ్రామాల్లోని స్కూళ్లలో స్వాతంత్ర దినోత్సవ జెండా ఎగరేయకుండా సర్పంచ్ లు, ఎంపీటీసీలను అడ్డుకోవడంపై పంచాయతీరాజ్ ఛాంబర్ కూడా మండిపడుతోంది. రేపు స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ సర్పంచ్ లు, ఎంపీటీసీలతోనే జాతీయ జెండా ఎగురవేయించాలని వైవీబీ రాజేంద్ర ప్రసాద్. డిమాండ్ చేశారు. పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ల తో జెండా ఎగుర వెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు 73, 74 వ రాజ్యాంగ సవరణ చట్టానికి విరుద్ధమని ఆయన అన్నారు. సర్పంచ్ , స్థానిక ప్రజాప్రతినిధుల హక్కులకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన వరుస జీవోలపై రాజేంద్ర ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ జెండా ఎగురవేసే హక్కును, అధికారాలను రాజ్యాంగం సర్పంచ్ లకు, ఎంపీటీసీలకు కల్పించిందని గుర్తుచేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ హక్కును కాల రాస్తూ విద్యా కమిటీ చైర్మన్లతో జెండా ఎగుర వేయించాలని ఆదేశాలు ఇవ్వడం దారుణమన్నారు.