రేపల్లె వైసీపీలో ఇన్ ఛార్జ్ చిచ్చు- మత్సకారుల ఆగ్రహంతో మోపిదేవికి సజ్జల కీలక హామీ..
ఏపీలో వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పు వ్యవహారం ఎన్నికలకు ముందు కాక రేపుతోంది. నిన్న మొదలైన ఇన్ ఛార్జ్ ల మార్పు వ్యవహారంలో రేపల్లె నియోజకవర్గం కూడా ఉంది. ఇక్కడ ప్రస్తుత ఇన్ ఛార్జ్ మోపిదేవి వెంకటరమణను కాదని ఈవూరు గణేశ్ అనే డాక్టర్ కు వైసీపీ బాధ్యతలు అప్పగించారు. దీంతో మోపిదేవి సామాజికవర్గమైన మత్సకార సంఘాలు మండిపడ్డాయి. ఆయన వర్గీయులు రాజీనామాలకు దిగారు.
రేపల్లె వైసీపీ ఇన్ ఛార్జ్ మార్పు వ్యవహారంపై ఆగ్రహంగా ఉన్న మత్సకార సంఘాలు ఇవాళ వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి తమ అసంతృప్తిని వెళ్లగక్కాయి. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గ బాధ్యతలు మరో వ్యక్తికి కట్టబెట్టడంపై తాడేపల్లిలోని ఓ హోటల్ వద్ద ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమాఖ్య ప్రతినిధులు కలిసి వినతిపత్రం సమర్పించారు.

దీంతో వారికి మోపిదేవి అంశం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి హామీ ఇచ్చారు. అయినా మత్సకారులు స్పష్టమైన హామీ కోసం పట్టుబట్టారు. ఇప్పటి వరకూ రేపల్లె నియోజకవర్గంలోని అన్ని కులాల వారిని కలుపుకుపోతూ ఒక తాటిపై తీసుకొచ్చి గడప గడపకూ కార్యక్రమంతో పాటు, ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణా రావు తిరిగారని సజ్జల దృష్టికి తెచ్చారు. దీంతో చేసేది లేక చివరికి మోపిదేవి వెంకటరమణారావును స్టార్ క్యాంపెయినర్ గా తిప్పుతామని సజ్జల వారికి చెప్పారు. దీనిపై స్పందించిన మత్సకారులు.. ముందు ఆయన్ను రేపల్లె ఇంచార్జిగా ప్రకటించాలని కోరారు.












Click it and Unblock the Notifications