Jonnagiri:దేశంలోనే తొలి ప్రైవేట్ స్వర్ణ గని..పసిడి వెలికితీత ప్రక్రియ ఎలా ఉంటుందంటే?
కర్నూలు: దశాబ్దాల కాలంగా ప్రభుత్వ రంగ సంస్థలకే పరిమితమైన బంగారు గనుల తవ్వకం,ఇప్పుడు ప్రైవేట్ రంగంలోకి అడుగుపెట్టింది.వచ్చే నెలలో కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి వద్ద ఈ ప్రతిష్టాత్మక ప్రైవేట్ బంగారు గనిని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు.
జొన్నగిరి ప్రాజెక్ట్ విశేషాలు:
- నిర్వహణ: ఈ ప్రాజెక్టును 'జియో మైసోర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్' (Geomysore Services) డెవలప్ చేస్తోంది.
- విస్తీర్ణం: సుమారు 598 హెక్టార్ల విస్తీర్ణంలో జొన్నగిరి, ఎర్రగుడి - పగిడిరాయి గ్రామాల పరిధిలో ఈ గని విస్తరించి ఉంది.
- పెట్టుబడి: ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ. 400 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారు.
- ఉత్పత్తి: 15ఏళ్ల పాటు ఏడాదికి సుమారు 1,000 కిలోల (1 టన్ను) స్వచ్ఛమైన బంగారాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.2027 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 600కేజీల బంగారం ఉత్పత్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.ప్రస్తుతం గనిలో 13.1 టన్నులు నిల్వలున్నట్లు ధృవీకరించారు.
- వజ్రాల ఖని: జొన్నగిరి ప్రాంతం కేవలం బంగారానికే కాదు, ప్రాచీన కాలం నుండి వజ్రాలకు కూడా ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రాంతం.

అసలు 'బంగారు గనులు' అంటే ఏమిటి?
భూమి పొరల్లో బంగారం నేరుగా బిస్కెట్లు లేదా ఆభరణాల రూపంలో దొరకదు. కోట్లాది సంవత్సరాల క్రితం భూగర్భంలో జరిగిన భౌగోళిక మార్పుల వల్ల బంగారం ఇతర ఖనిజాలతో కలిసి 'అయరు' (Ore) రూపంలో రాళ్ళలో నిక్షిప్తమై ఉంటుంది. ఇలా పసిడి నిల్వలు అధికంగా ఉన్న రాళ్ళ పొరలను గుర్తించి, వాటిని వెలికితీసే ప్రాంతాలనే బంగారు గనులు అంటారు.
రాతి నుంచి రత్నం వరకు: పసిడి ప్రాసెసింగ్ ఇలా..
బంగారాన్ని గని నుండి వెలికితీసి, మన చేతికి వచ్చే ఆభరణంగా మార్చడం వెనుక ఒక పెద్ద శాస్త్రీయ ప్రక్రియ ఉంటుంది:
- మైనింగ్ (Mining): జొన్నగిరిలో 'ఓపెన్ పిట్' (Open-pit) పద్ధతిలో రాళ్ళను తవ్వి తీస్తారు. అంటే భూమి ఉపరితలం నుండి లోతుగా గుంతలు తవ్వుకుంటూ వెళ్తారు.
- క్రషింగ్ & గ్రైండింగ్ (Crushing): గనుల నుండి తీసిన పెద్ద పెద్ద రాళ్ళను భారీ యంత్రాల ద్వారా పిండిలా (Fine powder) మారుస్తారు.
- లీచింగ్ (Leaching): ఈ పొడిని కెమికల్స్ (ముఖ్యంగా సైనైడ్ ద్రావణం) కలిపిన నీటిలో ఉంచుతారు. ఈ రసాయనం రాళ్ళలోని బంగారాన్ని తనలో కరిగించుకుంటుంది. దీనిని 'కార్బన్-ఇన్-లీచ్' ప్రక్రియ అని కూడా అంటారు.
- ఎలక్ట్రోవిన్నింగ్ (Electrowinning): ద్రావణంలో కరిగి ఉన్న బంగారాన్ని విద్యుత్ ప్రక్రియ ద్వారా వేరు చేసి, ముడి బంగారంగా మారుస్తారు.
- స్మెల్టింగ్ & రిఫైనింగ్ (Smelting): వచ్చిన ముడి బంగారాన్ని (Doré bars) అధిక ఉష్ణోగ్రత వద్ద కరిగించి, అందులోని ఇతర మలినాలను తొలగిస్తారు. చివరగా 99.9% స్వచ్ఛమైన గోల్డ్ బిస్కెట్లు తయారవుతాయి.
భారతదేశం ఏటా సుమారు 800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. మన దేశంలో ప్రస్తుతం కర్ణాటకలోని హట్టి గోల్డ్ మైన్స్ మాత్రమే ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది. ఈ తరుణంలో ఏపీలోని జొన్నగిరి గని అందుబాటులోకి రావడం వల్ల దిగుమతులపై భారం తగ్గడమే కాకుండా, స్థానికంగా వందలాది మందికి ఉపాధి లభించనుంది. రాయలసీమ గడ్డపై మళ్ళీ పసిడి సిరి మెరవబోతుండటం రాష్ట్ర పారిశ్రామిక రంగానికి ఒక మైలురాయిగా నిలవనుంది.












Click it and Unblock the Notifications