చరిత్ర సృష్టించిన బంగారం: దశాబ్ద కాలంగా పసిడి 'విశ్వరూపం'..
భారతీయుల పాలిట 'బంగారం' కేవలం ఒక లోహం మాత్రమే కాదు.. అది తరతరాల నమ్మకం, శాశ్వత సంపదకు నిదర్శనం. నేడు ఏప్రిల్ 19, 2026న దేశవ్యాప్తంగా అక్షయ తృతీయ జరుపుకుంటున్న వేళ, రిటైల్ పెట్టుబడిదారులు మరోసారి బులియన్ మార్కెట్ వైపు పరుగులు తీస్తున్నారు. అయితే, ఈ ఏడాది అక్షయ తృతీయ మునుపటి కంటే చాలా ప్రత్యేకం. ఎందుకంటే, గత ఏడాది కాలంలో పసిడి ఇచ్చిన రాబడులు చూస్తుంటే సామాన్యులకే కాదు, ఆర్థిక నిపుణులకు కూడా మైండ్ బ్లాంక్ అవుతోంది.
గత అక్షయ తృతీయ (2025) నుండి నేటి వరకు బంగారం ధరలు ఏకంగా 63.4% రాబడులను అందించాయి. ఇది ఇటీవలి కాలంలో అత్యంత బలమైన ర్యాలీలలో ఒకటిగా నిలిచింది. ఎంసీఎక్స్ (MCX) గణాంకాల ప్రకారం.. 2025 ఏప్రిల్ 30న 10 గ్రాముల బంగారం ధర సుమారురూ.94,611 ఉండగా, నేడు ఏప్రిల్ 18 నాటికి అది ఏకంగారూ.1,54,609కి చేరుకుంది. అంటే కేవలం ఒకే ఏడాదిలో తులం బంగారంపై ఏకంగారూ.59,998 పెరిగింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేయడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలిచాయి.

దశాబ్ద కాలంగా పసిడి 'విశ్వరూపం'..
కేడియా అడ్వైజరీ మరియు యాక్సిస్ సెక్యూరిటీస్ నివేదికల ప్రకారం, 2016 నుంచి 2026 వరకు గడిచిన పదేళ్లలో బంగారం 18% CAGR (సమ్మేళన వార్షిక వృద్ధి రేటు) సాధించింది.
- 2020: 47% కంటే ఎక్కువ లాభం.
- 2024: 21.5% పెరుగుదల.
- 2025: 30.3% వృద్ధి.
- 2026 (ప్రస్తుతం): 63.4% అసాధారణ ర్యాలీ.
- ఈ గణాంకాలను చూస్తుంటే, అస్థిరమైన స్టాక్ మార్కెట్ కంటే బంగారం నమ్మదగిన దీర్ఘకాలిక ఆస్తిగా తన కీర్తిని మరింత బలపర్చుకుంది.
రూ. 2 లక్షల మైలురాయిని చేరుకుంటుందా?
ఇప్పుడు ఇన్వెస్టర్ల మెదడులో మెదులుతున్న ఏకైక ప్రశ్న.. వచ్చే అక్షయ తృతీయ నాటికి తులం బంగారంరూ.2,00,000 మార్కును తాకుతుందా? అని. దీనిపై వెంతురా సెక్యూరిటీస్ కమోడిటీస్ హెడ్ ఎన్ఎస్ రామస్వామి సానుకూలంగా స్పందించారు. 2026 డిసెంబర్ నాటికి బంగారంరూ.1.75 లక్షలకు చేరి, వచ్చే అక్షయ తృతీయ నాటికిరూ.2 లక్షల మైలురాయిని తాకే బలమైన అవకాశాలు ఉన్నాయని ఆయన అంచనా వేశారు. 2026 ప్రారంభంలోనేరూ.1.5 లక్షల కీలక స్థాయిని దాటడం అనేది మార్కెట్ నిర్మాణంలో వచ్చిన ప్రాథమిక మార్పుగా ఆయన అభివర్ణించారు.
మారుతున్న వినియోగదారుల ధోరణి:
బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో వినియోగదారుల కొనుగోలు తీరులో మార్పు వచ్చింది. గత పండుగ సీజన్తో పోలిస్తే దేశీయ టికెట్ సైజు (కొనుగోలు సామర్థ్యం) 69% పెరిగినప్పటికీ, ఫిజికల్ డిమాండ్ (టన్నేజీ) 31% పడిపోయింది. అంటే జనాలు భారీ ఆభరణాలకు బదులుగా.. శుభకరం కోసం బంగారం నాణేలు, కడ్డీలు లేదా 18 క్యారెట్ల తేలికపాటి ఆభరణాల వైపు మొగ్గు చూపుతున్నారు. "భయంతో కొనే (FOMO) కంటే, బడ్జెట్ పరిమితుల వల్ల విలువకు ప్రాధాన్యత ఇస్తున్నారు" అని రామస్వామి విశ్లేషించారు.
నిపుణుల మాట:
ఐటిఐ గ్రోత్ ఆపర్చునిటీస్ ఫండ్ మేనేజింగ్ పార్ట్నర్ మోహిత్ గులాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "బంగారం ఇంతగా పెరిగినందుకు నేను ఆందోళన చెందడం లేదు.. నేను అమెరికన్ డాలర్ మరియు పెరుగుతున్న ద్రవ్య లోటు గురించి ఆందోళన చెందుతున్నాను. వాణిజ్య విధానాలు ఊహించని విధంగా ఉన్నప్పుడు, బంగారం కేవలం ఒక లోహం కాదు, అదొక సురక్షితమైన స్థానం. వచ్చే ఏడాదికిరూ.2,00,000 అనేది అసాధ్యమేమీ కాదు. తనను తక్కువ అంచనా వేసే వారిని ఆశ్చర్యపరచడం బంగారానికి వెన్నతో పెట్టిన విద్య" అని పేర్కొన్నారు.
మొత్తానికి, ఈ అక్షయ తృతీయ బంగారం ధరల పరంగా సరికొత్త చరిత్రను లిఖించింది. ధరలు ఎంత పెరిగినా 'పసిడి పాశం' నుండి భారతీయులు విడివడలేరని నేటి కొనుగోళ్ల రద్దీ మరోసారి నిరూపిస్తోంది.












Click it and Unblock the Notifications