శాంసంగ్ ఫోన్ వాడేవారికి కేంద్ర ప్రభుత్వ హెచ్చరిక
శాంసంగ్ (Samsung) స్మార్ట్ఫోన్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. ఆ కంపెనీకి సంబంధించిన స్మార్ట్ఫోన్లలో సెక్యూరిటీ లోపాన్ని గుర్తించినట్లు తెలిపింది. శాంసంగ్ ఫోన్లు వాడేవారు వెంటనే తమ ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సూచించింది. ఆండ్రాయిడ్ 11, 12, 13, 14 ఓఎస్తో పనిచేసే శాంసంగ్ ఫోన్లలో భద్రతాపరమైన లోపాన్ని కనుగొన్నామని, దీనివల్ల వ్యక్తులకు తెలియకుండానే వ్యక్తిగత డేటాను హ్యాకర్లు తస్కరించే ప్రమాదం ఉందని పేర్కొంది.
లేటెస్ట్ సెక్యూరిటీ అప్డేట్ చేసుకోవాలని ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన సెర్ట్ ఇన్ (CERT-In) సూచించింది. నాక్స్ ఫీచర్లపై కంట్రోలింగ్ లేకపోవడం, ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్లో లోపాలు, ఏఆర్ ఎమోజీ యాప్లో ఆథరైజేషన్ సమస్యలు, నాక్స్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్లో లోపాలను సరిదిద్దలేదని, వీటివల్లే ఈ సమస్య తలెత్తిందని సెర్ట్-ఇన్ తెలిపింది. ఈ లోపాల కారణంగా అటాకర్లు భద్రతాపరమైన అడ్డంకులు అధిమించే అవకాశం ఉందని, సున్నితమైన సమాచారాన్ని దొంగిలించే ప్రమాదం పొంచి ఉందని తన నోట్లో పేర్కొంది.

ఒకవేళ ఆయా ఉత్పత్తుల్లో ఉన్న లోపాలను గుర్తించి చొరబడితే డివైజ్ పిన్ను, ఏఆర్ ఎమోజీ సాండ్బాక్స్ డేటాను అటాకర్లు రీడ్ చేయగలరు. సిస్టమ్ టైమ్ను మార్చి నాక్స్ గార్డ్ లాక్ను బైపాస్ చేయడంతోపాటు అర్బిట్రరీ ఫైల్స్, సున్నితమైన సమాచారాన్ని తస్కరించే ప్రమాదం ఉందని సెర్ట్-ఇన్ పేర్కొంది. శాంసంగ్ లేటెస్ట్ ఫోన్లు గెలాక్సీ ఎస్23, గెలాక్సీ జడ్ ఫ్లిప్ 5, గెలాక్సీ జడ్ ఫోల్డ్ 5 సహా ఆండ్రాయిడ్ 11, 12, 13, 14తో పనిచేసే డివైజుల్లో ఈ లోపం ఉన్నట్లు సెర్ట్-ఇన్ పేర్కొంది. యూజర్లు ఫోన్ సెట్టింగ్స్లోని అబౌట్ డివైజ్లోకి వెళ్లి లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ను ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించింది. భవిష్యత్లో ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఫోన్ అప్డేట్ చేసుకోవాలని, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకులను క్లిక్ చేయకూడదని టెక్ నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications