ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్.. జనతాఖానా
దేశవ్యాప్తంగా రైల్లో ప్రయాణించేవారికి అతి తక్కువ ధరలో నాణ్యమైన భోజనం, తాగునీరు అందించేందుకు భారతీయ రైల్వే సమాయత్తమవుతోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నాలుగు రైల్వేస్టేషన్లలో ఈ సేవలను ప్రారంభించారు. వీటికి లభించే ఆదరణను బట్టి ఇతర స్టేషన్లకు విస్తరిస్తారు. తొలి దశలో విజయవాడ, హైదరాబాద్, గుంతకల్లు, రేణిగుంట్ల స్టేషన్లలో భోజనం, తాగునీరు అందుబాటులోకి తెచ్చారు. రూ.20, 50 వీటి ధరలుగా ఉన్నాయి.
ప్రస్తుతం ఈ ప్రణాళికను ఆరునెలలపాటు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఆ తర్వాత వారినుంచి వచ్చే ఆదరణను బట్టి అధికారులు నిర్ణయం తీసుకుంటారు. ఐఆర్సీటీసీకి చెందిన కిచెన్ యూనిట్లు, జనాహార్ కేంద్రాలు ఈ ఆహారాన్ని సరఫరా చేస్తాయి. జనరల్ బోగీలు ఎక్కడైతే ఆగుతాయో వాటికి దగ్గరగా వీటిని ఏర్పాటు చేస్తారు.

భోజనాన్ని రెండు కేటగిరీలుగా విభజించారు. మొదటి కేటగిరిలో 7 పూరీలతోపాటు ఆలుకూరు, పచ్చడిని అందిస్తారు. దీని ధర రూ.20గా ఉంటుంది. రెండో కేటగిరిలో అన్నం, కిచిడి, ఛోలే-కుల్చే, ఛోలే-భటూరే, పావ్ బాజీ, మసాలాదోశల్లో ఒక దాన్ని ఎంచుకోవచ్చు. దీని ధరను రూ.50గా నిర్ణయించారు. అలాగే 200 మిల్లీలీటర్ల ప్యాకేజ్డ్ వాటర్ గ్లాస్ లు అందిస్తారు. కౌంటర్ల వద్ద ఇవి అందుబాటులో ఉంటాయి. తూర్పు కోస్తా రైల్వే పరిధిలోని రూర్కీ, జార్సుగూడ, ఖుర్దారోడ్ స్టేషన్లలో కూడా ఈ సేవలు అమలవుతున్నాయి. విజయవాడ, హైదరాబాద్, గుంతకల్లు, రేణిగుంట్ల స్టేషన్లు జంక్షన్లు కావడంతో ప్రయాణికుల నుంచి వీటికి మంచి ఆదరణ దక్కుతుందని అధికారులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications