పట్టాలెక్కబోతున్న కొత్త రైలు... వందేభారత్ కూడా పనికిరాదు
ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ 2014లో బాధ్యతలు స్వీకరించారు. 2024లో మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు. దాదాపు ఈ 11 సంవత్సరాల కాలంలో ఆయన విదేశాంగ విధానం, హోంశాఖతోపాటు రైల్వేకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చేవారు. దేశవ్యాప్తంగా ప్రయాణికులకు అతి తక్కువ ఖర్చుతో సాధ్యమైనంత ఎక్కువ దూరం ప్రయాణించేలా చేయాలన్నదే ఆయన విధానం. అందుకనుగుణంగా ఈ దశాబ్దకాలంలో భారతీయ రైల్వే అనేక మార్పులకు గురైంది. అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంతోపాటు ప్రయాణికులకు విలాసవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ఈకోవలో ఇటీవలే పట్టాలెక్కిన రైలు వందేభారత్. దేశంలోని ప్రధాన నగరాల మధ్య ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలో చేరుకునేలా రూపొందించిన సెమీ హైస్పీడ్ రైళ్లు ఇవి. ప్రయాణికుల నుంచి వీటికి మంచి ఆదరణ లభిస్తోందికానీ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. దీంతో కొన్ని మార్గాల్లో వందేభారత్ రైళ్లు ఖాళీగా నడవాల్సి వస్తోంది. త్వరలో వందేభారత్ స్లీపర్ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే వందేభారత్ కు మించిన రైలును భారతీయ రైల్వే తీసుకురాబోతోంది. అదే హైడ్రోజన్ రైలు. ఈ ఏడాది చివరలో ట్రయల్ రన్ ప్రారంభిస్తారు. జర్మనీకి చెందిన టీయూవీ- ఎస్యూడీ కంపెనీకి కేంద్రం బాధ్యతలు అప్పగించింది.

రూ.80 కోట్ల వ్యయంతో తయారయ్యే ఈ హైడ్రోజన్ రైలుకు నాలుగు కోచ్ లు ఉంటాయి. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. తొలిదశలో 35 రైళ్లను తీసుకురాబోతున్నారు. హర్యానాలోని జింద్-సోనిపట్ మధ్య తొలి హైడ్రోజన్ రైలు నడవబోతోంది. ఈ రైళ్ల వల్ల ఎటువంటి కాలుష్యం వెలువడదు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం చైనా, స్వీడన్, జర్మనీ, ఫ్రాన్స్ మాత్రమే హైడ్రోజన్ రైళ్లు నడుపుతున్నాయి. ఐదో దేశంగా భారత్ నిలవబోతోంది. వీటిని ఎక్కువగా ప్రకృతి సౌందర్యాలను వీక్షించడానికి అనువుగా ఉండే ప్రాంతాలైన డార్జిలింగ్ హిమాలయన్, కల్కా సిమ్లా రైల్వే, కాంగ్రా వ్యాలీ, బిల్మోరా వాఘై మార్గాల్లో నడపడానికి ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications