జగన్ పై చంద్రబాబు కీలక నిర్ణయం..! కేబినెట్లో మంత్రులకు వెల్లడి..!
ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు ఓ కీలక విషయంపై చర్చించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సంబంధించి వచ్చిన ఆరోపణలపై మంత్రులతో చర్చించిన సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతరం జగన్ పై ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీన్ని సీఎం చంద్రబాబు మంత్రులకు వివరించారు. దీంతో మంత్రులు కూడా సరేనన్నారు.
ఇంతకీ విషయం ఏంటంటే.. నిన్న ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఇందుకు నిదర్శనంగా జగన్ తనకు సన్నిహితుడైన ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తితో ఆర్ధిక సంస్థలకు 200 మెయిల్స్ పెట్టించారని సంచలన ఆరోపణ చేశారు. దీనికి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఏపీఎండీసీ జారీ చేసిన బాండ్లలో పెట్టుబడులు పెట్టొద్దంటూ జగన్ ఇలా లేఖలు రాయించారని పయ్యావుల తెలిపారు.

ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలపై చర్చ వచ్చింది. దీంతో పయ్యావుల .. జగన్ పెట్టించిన మెయిల్స్ వ్యవహారంపై కేబినెట్లోనే సీఎం చంద్రబాబుకు వివరాలు అందజేశారు. తాను తప్పులు చేసి ఇతరులపై వాటిని నెట్టేసే కుట్రలకు వైసీపీ పాల్పడుతోందని తెలిపారు. ఓవైపు నిధులు రాకుండా అడ్డుకుంటూ, మరోవైపు పథకాలు అమలు చేయడం లేదంటూ జనంలోకి వెళ్లి ప్రచారం చేస్తున్నారని జగన్ ను విమర్శించారు.

రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతినేలా కంపెనీలకు 200 మెయిల్స్ పెట్టిన వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవాలని సీఎంకు మంత్రులకు సూచించగా.. ఆయన దీనిపై విచారణ చేయిస్తానని వారికి హామీ ఇచ్చారు. మామిడి రైతుల విషయంలోనూ వైసీపీ ఇలాంటి కుట్రలకు పాల్పడిన విషయాన్ని ఆయన మంత్రులకు గుర్తుచేశారు. ఇలాంటి వాటి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications