భవనంపై నుంచి దూకి విద్యార్థిని రేవతి ఆత్మహత్య (పిక్చర్స్)
తిరుపతి: ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని కళాశాల భవనంపై నుంచి దూకి శుక్రవారంనాడు ఆత్మహత్య చేసుకుంది. తిరుపతి వెస్ట్ డిఎస్పీ జె. శ్రీనివాసులు, ఎంఆర్ పల్లి సిఐ షరీఫుద్దీన్ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం బాల్రెడ్డిగారి పల్లెకు చెందిన ఎ. వెంకటరెడ్డి, లక్ష్మీదేవిల కూతురు ఎ రేవతి (17)గా ఆ అమ్మాయిని గుర్తించారు.
రేవతి ఉప్పరపల్లెలోని ఓ కార్పోరేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ బైపిసి మొదటి సంవతస్రం చదువుతోంది. గత కొన్ని రోజులుగా ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థిని స్థానిక పద్మావతి కళాశాలలో పరీక్షలకు హాజరవుతోంది.
శుక్రవారంనాడు ఉదయం పరీక్షకు హాజరైన విద్యార్థిని ఆ తర్వాత కళాశాలకు చేరుకుని భోజనం చేసి గదిలోని తోటీ విద్యార్థినులతో కలిసి విశ్రాంతి తీసుకుంది. మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో స్టడీ అవర్స్ ఉండడంతో విద్యార్థులు మొదటి అంతస్థులోని తరగతి గదికి వెళ్లారు. అయితే రేవతి మాత్రం భవనం మూడో అంతస్తు పిట్టగోడపైకి ఎక్కి కూర్చుని అక్కడి నుంచి కిందికి దూకేసింది.
విద్యార్థిని ఆత్మహత్య
భవనం మూడో అంతస్థు నుంచి దూకిన రేవతి విషయంపై వాచ్మన్ కళాశాల ఉద్యోగులకు సమాచారం అందించాడు. దాంతో ఆమెను వైద్య చికిత్స కోసం ప్రభుత్వ రుయా ఆస్పత్రి అత్యవసర విభాగానికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మరణించింది.
విద్యార్థిని ఆత్మహత్య
పోలీసులు తోటి విద్యార్థినులను ప్రశ్నించారు. రేవతి పరీక్ష సరిగా రాయలేదనే ఆందోళనతో ఏడ్చినట్లు తాము గుర్తించామని, అయితే ఆత్మహత్య చేసుకున్నట్లు తమకు తెలియదని విద్యార్థులు చెప్పారు.
తల్లిదండ్రులు ఇలా...
తమ కూతురు మృతికి సంబంధించిన సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ప్రభుత్వ రుయా ఆస్పత్రికి చేరుకుని మృతదేహం వద్ద కన్నీరుమున్నీరయ్యారు.
విద్యార్థుల ఆందోళన
కళాశాల వద్దకు చేరుకున్న విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్ నాయకులు ఆందోళనకు దిగారు. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని ఆరోపించారు.