ఆర్టీసీ రాకపోకలపై స్పందించని పొరుగు రాష్ట్రాలు: ఏపీ నుంచి కదలని బస్సులు
లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత పెరిగిపోతున్న కేసులతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఓవైపు కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా మినహాయింపులు పెంచుతున్నా.. మరోవైపు కరోనా వ్యాప్తికి అవకాశం ఉన్న ప్రజా రవాణా వంటి విషయాల్లో మాత్రం ఎక్కడా వెనక్కితగ్గడం లేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ప్రజా రవాణాపై తీవ్ర ప్రభావం పడుతోంది.
Recommended Video
ఏపీ నుంచి కదలని బస్సులు...
లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో బస్సులు పరిమితంగా నడుపుతున్న ఏపీఎస్ఆర్టీసీ... ఇతర రాష్ట్రాలకు మాత్రం నడిపే పరిస్దితి కనిపించడం లేదు. ఏపీ నుంచి మీ రాష్ట్రాలకు బస్సులు నడపుతామని ఆర్టీసీ అధికారులు లేఖలు రాసినా పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, ఒడిశా నుంచి ఎలాంటి స్పందనా లేదు. దీంతో మరికొన్ని రోజులు వేచి చూసే ఆలోచనలో ఏపీ రవాణాశాఖ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రాలకు పట్టని సడలింపులు
లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా కేంద్రం రాష్ట్రాల మధ్య ప్రజా రవాణాకు అనుమతించింది. కేంద్రం సడలించినా స్ధానిక పరిస్దితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలు త్వరగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయి. కేంద్రం అనుమతి ఇచ్చినా ప్రస్తుతం ప్రజా రవాణాను ఇతర రాష్ట్రాలకు అనుమతించే విషయంలో రాష్ట్రాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇవాళ్టి నుంచి గుళ్లు, షాపింగ్ మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు కూడా పునరుద్ధరిస్తున్న నేపథ్యంలో ఆయా ప్రభుత్వాలు మరికొన్ని రోజులు వేచిచూసే ధోరణి అవలంబించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కరోనా కేసులే కారణం...
ప్రస్తుతం ఏపీతో పాటు పొరుగున ఉన్న తెలంగాణ, కర్నాటక, తమిళనాడు ఒడిశా వంటి రాష్ట్రాల్లో కరోనా కేసుల వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఏపీ తెలంగాణలో మూడు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకీ కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. పొరుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్ధితి. ఇలాంటి నేపథ్యంలో అంతర్ రాష్ట్ర బస్సులను తిప్పితే పరిస్ధితి చేజారుతుందనే ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది. దీంతో ప్రభుత్వాలు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేని పరిస్ధితి.