మోడీకి బాబు రూ.1000 నోట్లపై సూచన, అక్కడా జగన్ టార్గెట్!
న్యూఢిల్లీ: నల్ల ధనం పైన కొరడా ఝుళిపించేందుకు రూ.వెయ్యి నోట్ల పైన నిషేధం విధించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం అన్నారు. అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో దానిని కూడా ఓ అజెండాగా చేర్చాలని కేంద్రానికి సూచించారు.
అవినీతి నిర్మూలనకు మరిన్ని సంస్కరణలు తీసుకురావాలన్నారు. అవినీతిని అంతం చేయడంలో మన దేశం ఐక్యరాజ్య సమితితో కలిసి పని చేస్తుండటంతో అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో దాన్ని కూడా ఓ అజెండాగా చేర్చాలన్నారు
ప్రధాని సాక్షిగా ప్రత్యేక హోదాను లేవనెత్తిన బాబు
ప్రత్యేక దర్యాప్తు బృందం సిఫార్సు చేసినట్లు రూ.3 లక్షలకు పైన నగదు లావాదేవీలను నిషేధించాలని, గరిష్ఠ నగదు నిల్వలను రూ.10 లక్షలకే పరిమితం చేయాలని కోరారు. అవినీతి కేసులను నిర్దిష్ట కాలావధిలోపు పరిష్కరించాలని సూచించారు. అక్రమాస్తుల కేసుల్లోని నిందితుల ఆస్తులను తక్షణం స్వాధీనం చేసుకొనే వెసులుబాటు కల్పించాలన్నారు.
తద్వారా చంద్రబాబు అక్కడ కూడా వైసిపి అధినేత జగన్ ఆస్తుల కేసు విషయమై పరోక్షంగా ప్రస్తావించారని అంటున్నారు. చంద్రబాబు చేసిన ఈ ప్రతిపాదనను బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీష్ కుమార్ కూడా సమర్థించారు.
కాగా, గవర్నర్ల ఎంపిక సమయంలో రాష్ట్రాలను సంప్రదించాలనే సిఫార్సును తెలంగాణ సమర్థించింది. గవర్నర్లకు విచక్షణాధికారాలు ఉండరాదని, ఏవైనా బిల్లులను దీర్ఘకాలం ఆపకుండా నిర్ణీత కాలపరిమితిలో ఆమోదించేలా ఉండాలని, గవర్నర్లు రాజ్యాంగపరమైన విధుల్లో ఉన్నందున విశ్వవిద్యాలయాలకు వారు వైస్ ఛాన్సులర్లుగా ఉండరాదనే సిఫార్సును కూడా తెలంగాణ అంగీకరించింది.
మరోవైపు, ప్రజల చేత లేదా ప్రజాప్రతినిధులు చేత ఎంపిక కాని గవర్నర్కు ఐదేళ్ల పూర్తి కాల పదవిని ఏపీ వ్యతిరేకించింది. ఇదిలా ఉండగా, విభజన నేపథ్యంలో ఏపీ ఎంతో నష్టపోయిందని, తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చంద్రబాబు కోరారు.
చంద్రబాబు
భాగస్వామ్యపక్షాలతో సంప్రదింపులు జరపకుండానే విభజన ప్రక్రియ చేపట్డటారని, రెండు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలకు రక్షణ కల్పించడంతో పాటు, ఆస్తులు, అప్పుల విభజన సున్నితంగా జరగాలన్న సూత్రాన్ని విస్మరించారని చంద్రబాబు అన్నారు.
చంద్రబాబు
58% జనాభా ఉన్న కొత్త రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంలోని 46% ఆదాయాన్ని పంచారని, ఆస్తులను ప్రాంతాలవారీగా, అప్పులను జనాభా ప్రాతిపదికన ఇచ్చారని చంద్రబాబు అన్నారు.
చంద్రబాబు
విభజన చట్టంలో చెప్పినవాటితోపాటు ఏపీకి ప్రత్యేక హోదా, జాతీయ ప్రాజెక్టుగా పోలవరం నిర్మాణం, రాజధాని నిర్మాణానికి ప్రత్యేక ఆర్థికసాయం, విశాఖపట్నానికి రైల్వేజోన్ ఇవ్వాలన్నారు.
చంద్రబాబు
వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, వేగవంతమైన పారిశ్రామికీకరణకోసం పన్నుప్రోత్సాహకాలు, రెవిన్యూలోటు భర్తీకి నాటి ప్రధాని రాజ్యసభలో హామీ ఇచ్చారని, వాటిని వేగంగా అమలుచేయాలని ఈ అధికారిక వేదిక నుంచి ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నట్లు బాబు చెప్పారు.
చంద్రబాబు
నదీపరివాహకంలో చిట్టచివర ఉన్న ఏపీ సాగునీటి పరంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోందని, రాష్ట్ర విభజన మరిన్ని కష్టాలు, తీర్చలేని సమస్యల్లోకి నెట్టిందని, ఇప్పటి వరకూ కృష్ణా, గోదావరి నదీయాజమాన్య మండళ్ల ఏర్పాటు పూర్తి కాలేదన్నారు.
చంద్రబాబు
విభజన చట్టంలోని నిబంధనలు, రాజ్యసభ ద్వారా నాటి ప్రధాని ఇచ్చిన హామీల గురించి అన్ని రాజకీయ పార్టీలకూ తెలుసు కాబట్టి వాటి అమలు కోసం అన్ని పార్టీలూ సహకరించాలన్నారు.
చంద్రబాబు
రాష్ట్ర విభజన నేపథ్యంలో అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు తెలంగాణకు వెళ్లినందున ఏపీలో కొత్తగా ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటుకు కేంద్రం తగిన సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబు
కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో గ్రేహౌండ్ శిక్షణ కేంద్రం, ఏపీ పోలీస్ అకాడెమీలాంటి సంస్థలను ఏర్పాటు చేయాల్సి ఉందని, ఇందుకు కేంద్రం తగిన ఆర్థిక మద్దతివ్వాలన్నారు.