సీఎం జగన్ - నందమూరి బాలకృష్ణ ఫేస్ టు ఫేస్: అప్పుడే ఎంపీ రఘురామ..!!
పద్మాలయ స్టూడియో వేదికగా ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ పద్మాలయ స్టూడియోలో కృష్ణ భౌతికకాయానికి అంజలి ఘటించారు. ఆ సమయంలో కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు ముఖ్యమంత్రిని పక్కనే ఉన్న కృష్ణ కుటుంబ సభ్యుల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ కృష్ణ పిల్లలను సీఎం జగన్ వరుసగా పలకరించారు. వారికి ధైర్యం చెప్పారు. అక్కడే మహేష్ బాబుకు ఆలిగనం చేసుకున్న సీఎం జగన్ ఓదార్చారు. ధైర్యంగా ఉండాల్సిన సమయమని చెప్పారు.
బాలయ్య - సీఎం జగన్ పలకరింపులు
అప్పటికే అక్కడ నందమూరి బాలకృష్ణ, ఆయన భార్య కూడా కృష్ణ కుటుంబంతో పాటే ఉన్నారు. మహేశ్ను, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చిన బాలయ్య ధైర్యం చెప్పి వారితో పాటే ఉన్నారు. మహేష్ బాబుతో సీఎం మాట్లాడుతున్న సమయంలో పక్కనే బాలకృష్ణ ఉన్నారు. బాలకృష్ణ కాస్త వెనుక పక్క ఉండటంతో తొలుత జగన్ గమనించలేదు. ఆ తర్వాత బాలయ్య అక్కడ ఉన్న విషయం గ్రహించిన జగన్ నమస్కారం చేశారు. బాలయ్య కూడా అంతే మర్యాదతో జగన్కు ప్రతి నమస్కారం చేశారు. బాలయ్య వెనుక నుంచి ముందుకొచ్చి నిల్చున్నారు.
జయదేవ్ కు సీఎం పలకరింపు
జయప్రద కూడా జగన్ను గమనించలేదు. కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు జయప్రదను గమనించి ఆమెను పిలవడంతో ఆమె జగన్కు నమస్కారం చేశారు. జగన్ కూడా ఆమెకు నమస్కారం పెట్టారు. కృష్ణ కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి పరామర్శిస్తున్న సమయంలో పక్కనే టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఉన్నారు. ఆలస్యంగా జయదేవ్ ను గమనించిన సీఎం జగన్ ఆయన్ను పలకరించారు. అయితే, అక్కడే ఉన్న గల్లా అరుణ మాత్రం..సీఎం తో పలకరింపులకు దూరంగానే ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ పద్మాలయ స్టూడియోకు చేరుకొనే ముందు వైసీపీ ఎంపీ రఘురామ అక్కడకు చేరుకున్నారు.
కృష్ణ కుటుంబ సభ్యులకు పరామర్శ
కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించరారు.కృష్ణ భౌతిక కాయానికి నివాళి అర్పించారు. సీఎం అక్కడకు చేరుకోవటానికి కొద్ది సేపు ముందే ఎంపీ రఘురామ అక్కడ నుంచి వెళ్లారు. అయితే, ఇద్దరు ఎదురెదురు పడితే..పలకరించుకొనే వారా..లేదా అనేది ఆసక్తి కర అంశంగా మారింది. ఇక, కృష్ణ కుటుంబం నాడు వైఎస్సార్ తో..ఆ తరువాత జగన్ తోనూ సన్నిహితంగా ఉంటోంది. గతంలో కృష్ణ ను సీఎం జగన్ సైతం కలిసి పరామర్శించారు. సీఎంతో పాటుగా మంత్రులు రోజా, చెల్లుబోయిన వేణు పద్మాలయ స్టూడియలో కృష్ణ కు నివాళి అర్పించారు.