హైకోర్టు సీజే ప్రమాణంలో ఆసక్తికర సీన్-పక్కపక్కనే చంద్రబాబు, అంబటి-ఏం మాట్లాడుకున్నారంటే ?
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అధికార వైసీపీకీ, విపక్ష టీడీపీకీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పలు నియోజకవర్గాల్లో వైసీపీ, టీడీపీ నేతలు, కార్యకర్తల మధ్య నిత్యం వాగ్వాదాలు, రోడ్లపై గొడవలు సర్వసాధారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ మంత్రి, విపక్ష పార్టీ అధినేత కలిసి పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకుంటే.. ఇంకేమైనా ఉందా.. ఈ ఘటన ఇవాళ చోటు చేసుకుంది. హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ధీరజ్ ఠాకూర్ ప్రమాణస్వీకార కార్యక్రమం ఇందుకు వేదికైంది.
ఇవాళ ఉదయం జరిగిన హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో సీఎం జగన్, గవర్నర్ అబ్దుల్ నజీర్, హైకోర్టు కొత్త సీజే ధీరజ్ ఠాకూర్ తో పాటు పలువురు మంత్రులు, న్యాయమూర్తులు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విపక్ష నేత చంద్రబాబుకు కూడా ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం అందింది. దీంతో ఆయన హైకోర్టు సీజే ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రి అంబటి రాంబాబు పక్కన సీటు కేటాయించారు.

మంత్రి అంబటి రాంబాబు పక్కనే విపక్ష నేత చంద్రబాబుకు సీటు కేటాయించడంతో ఆయన అక్కడికి వచ్చి కూర్చున్నారు. జాతీయ గీతాలాపనకు ఇద్దరూ కలిసి నిలబడ్డారు. అనంతరం తిరిగి కూర్చుని ఒకరినొకరు పలకరించుకున్నారు. కాసేపు యోగ క్షేమాలు అడిగితెలుసుకున్నారు. అలాగే ఏదో మాట్లాడుకుంటూ కనిపించారు. దీంతో అక్కడికి వచ్చిన వారంతా దీనిపై చర్చించుకోవడం కనిపించింది. అసలే బహిరంగంగా నిత్యం చంద్రబాబుపై నిప్పులు చెరిగే మంత్రి అంబటి ఏం మాట్లాడి ఉంటారా అన్న చర్చ సాగింది.
దీనిపై వివరాలు బయటికి రాలేదని అనుకుంటున్న తరుణంలో చంద్రబాబు రోజువారీ పెడుతున్న ప్రెస్ మీట్ తర్వాత మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఉదయం సీజే ప్రమాణస్వీకారం సందర్భంగా మంత్రి అంబటి రాంబాబుతో ఏం మాట్లాడారని ఆయన్ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు.. మంత్రి రాంబాబు ఏదో మాట్లాడారు..నేను పట్టించుకోలేదు..వాళ్ళతో మాట్లాడాలి అంటే సిగ్గుగా ఉంది అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంతకు మించి మాట్లాడలేదు. అంబటి మాత్రం పూర్తి మౌనంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications