టెన్త్,ఇంటర్ పరీక్షల రద్దుకు జోక్యం చేసుకోండి.!కేంద్ర హోంమంత్రి అమీత్ షాకు లోకేష్ లేఖ.!
అమరావతి/హైదరాబాద్ : రాష్ట్రంలో పది, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల రద్దుకు కేంద్రం జోక్యం కోరుతూ హోంమంత్రి అమీత్ షాకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాసారు. దేశంలోని దాదాపు 14 రాష్ట్రాలతో పాటు ఐసిఎస్ఇ, సిబిఎస్ఇ బోర్డులు పరీక్షలు రద్దు చేశాయని, ఏపీలో మాత్రం ఇందుకు విరుద్ధంగా చర్యలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు.
టెన్త్,ఇంటర్ పరీక్షల నిర్వహణ ప్రమాదం.. కేంద్ర హోంమంత్రికి నారా లోకేష్ లేఖ..
జూన్ 7 నుంచి వేలాది పరీక్షా కేంద్రాల్లో 6.7 లక్షల మంది విద్యార్థులకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని లోకేష్ తెలిపారు. 5 లక్షలకు పైగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు తమ పరీక్షల పట్ల అనిశ్చితిని ఎదుర్కొంటున్నారని, దీంతో ఈ రెండు తరగతుల విద్యార్థులు ఎంతో మానసిక ఒత్తిళ్లు అనుభవిస్తున్నారని అన్నారు.
ప్రమాద ఘంటికలు మోగుతూనే ఉన్నాయి.. కేంద్రం జోక్యం చేసుకోవాలన్న లోకేష్
గత ఏడాది మార్చి నుంచి ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చిన విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సిద్ధంగా లేరని స్పష్టం చేసారు. అనవసరంగా మరింత మందిని కరోనా రెండో దశ ఉధృతికి పరీక్షల వంకతో ఫణంగా పెట్టడం తగదని లోకేష్ హితవు పలికారు. లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి పరీక్షలు వద్దని అభ్యర్థనలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని లోకేష్ అన్నారు.
పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా పరీక్షలకు వ్యతిరేకమే.. రద్దు చేయించాలన్న టీడిపి..
పరీక్షల నిర్వహణతో విద్యార్థులను సూపర్ స్ప్రెడర్ లుగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయని మండిపడ్డారు. ఆన్లైన్ ద్వారా తాను విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో నిర్వహించిన దశల వారీ సమావేశాలు, అభిప్రాయ సేకరణలో పరీక్షల రద్దుకు 5లక్షల మందికి పైగా మద్దతు పలికారని లోకేష్ తెలిపారు. పది, ఇంటర్ పరీక్షల విషయంలో సిబిఎస్ఇ అనుసరిస్తున్న విధానాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేసేలా చర్యలు తీసుకోమని కోరుతున్నానని లేఖలో లోకేష్ తెలిపారు.
కేంద్రం తగు సూచనలు చేయాలి.. అమీత్ షా ను కోరిన లోకేష్..
గత నెలలో ఏపీలో 20శాతం కంటే ఎక్కువగా కరోనా పాజిటివ్ రేటు నమోదవుతుంటే పరీక్షలు నిర్వహణ తగదని భావిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులు,ఉపాధ్యాయులను బాధించేలా 3వ దశ ఉధృతి హెచ్చరికలు ఉన్నాయని, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల ఆందోళనలను గమనించి విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమీత్ షా కు రాసిన లేఖలో నారా లోకేష్ పేర్కొన్నారు.