విశాఖ 'స్మార్ట్ సిటీపై' బాబు ఆనందం, అమరావతికి వృద్ధురాలు రూ.1 కోటి విరాళం
విశాఖ: విశాఖపట్నం స్మార్ట్ సిటీగా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు చెప్పారు. విశాఖ నగరం మరోసారి అంతర్జాతీయ స్థాయి వేడుకకు వేదిక కావటం హర్షణీయమని ఆయన అన్నారు.
గురువారం ఆయన నగరంలో అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష సందర్భంగా ఐఎఫ్ఆర్ గ్రామం, ప్రదర్శనను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. దేశానికి, రాష్ట్రానికి, మంచి వనరుగా తీర ప్రాంతం ఉపయోగపడుతోందన్నారు.
దేశీయ ఉత్పత్తి విధానానికి నాంది పలికిన నౌకాదళానికి, కార్యక్రమానికి విచ్చేసిన వివిధ నౌకాదళ అధికారులకు అభినందనలు తెలిపారు. ఈ వేడుకలకు వేదిక కావడం మన అదృష్టమని చెప్పారు. విశాఖ పెట్టుబడులకు చాలా అనుకూలమైనదని చెప్పారు.
వేడుకల ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు అందర్నీ అలరించాయి. అంతకుముందు చంద్రబాబు విక్టరీ ఎట్ సీ స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. ఏయూ ఐఎఫ్ఆర్ గ్రామాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కాగా, ఐఎఫ్ఆర్ అతిపెద్ద మిలిటరీ ఎక్సర్సైజ్గా నిలుస్తుంది.
అమరావతికి రూ.కోటి విరాళం
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ఓ వృద్ధురాలు రూ.కోటి విరాళం ప్రకటించారు. గుంటూరు జిల్లాలోని తక్కెళ్లపాడుకు చెందిన స్వరాజ్యం అనే వృద్ధురాలు ఈ విరాళం ప్రకటించారు. ఇప్పటికే ఆ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేశారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కోరిట రూపాయలను అందిస్తారు. తెలుగు జాతి గర్వపడేలా రాజధాని నిర్మించడం అభినందనీయమని, చంద్రబాబును అభినందిస్తున్నట్లు ఆమె చెప్పారు.