మెట్రోస్టేషన్లలో మూడో కన్ను, అంతర్జాతీయస్థాయిలో..
హైదరాబాద్: నగర ప్రజలకు త్వరలో అందుబాటులోకి రానున్న ఆధునిక రవాణా వ్యవస్థ మెట్రో రైలులో అంతర్జాతీయ ప్రమాణాలతో భద్రత ఏర్పాట్లను చేపట్టనున్నట్లు మెట్రోరైలు ఎండి డా ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ప్రయాణికుడు లోపలికి వచ్చే ఎంట్రెన్స్ మొదలుకుని మళ్లీరైలు దిగే వరకు ప్రతి కదలికను గమనించే విధంగా ఎంట్రెన్స్కు అనుసంధానం చేస్తూ సిసిటివిలను ఏర్పాటు చేసి, స్టేషన్లలో మహిళలు, యువతుల, చిన్నారుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు తెలిపారు.
మెట్రో రైలులో ప్రయాణికుల భద్రతకు అత్యధికంగా ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. అన్ని స్టేషన్లలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసి, వాటినిరైళ్లలో ఏర్పాటు చేసే సిసి కెమెరాలో అనుసంధానం చేసి, ఎప్పటికపుడు రికార్డింగ్ చేయనున్నట్లు వివరించారు. నేరాలు జరిగే అవకాశమున్నపుడు ముందుగానే పసిగట్టి అలారమ్ మోగే విధంగా రహస్య ప్రాంతాల నుంచి వీటిని ఆపరేట్ చేస్తామన్నారు.
ఈ విధమైన భద్రత ప్రమాణాలను అమలు చేస్తున్న ఢిల్లీ, బెంగళూరు మెట్రో రైళ్ల మాదిరిగా హైదరాబాద్ మెట్రో రైలులో కూడా మెట్రో రైలు స్టేషన్, పార్కింగ్, సర్క్యులేషన్ ఏరియా, కంట్రోల్ సెంట్రల్, రైళ్లు,బుకింగ్ కేంద్రాలు, ఫ్లాట్ఫామ్లు, డిపోల్లో కూడా ఈ ప్రమాణాలను అమలు చేస్తామన్నారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులతో చర్చలు నిర్వహించి, సెక్యూరిటీ ప్లాన్కు సంబంధించిన గైడ్లైన్స్ను ఖరారు చేస్తామన్నారు.
ఇందుకు సంబంధించి మెట్రో, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లో నుంచి ప్రతిపాదనలు, సలహాలు, సూచనలను తీసుకోవటమే గాక, కేంద్ర హోంశాఖ నుంచి కూడా సూచనలు కోరనున్నట్లు తెలిపారు. ఎన్వీఎస్ రెడ్డి బుధవారం మెట్రో రైలు సెక్యూరిటీ ప్లాన్ పైన నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్, ఎల్ అండ్ టి అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ మెట్రో రైలులో ప్రయాణికుల భద్రత నేరాల నివారణ, కేసులకు సంబంధించి ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్లను, సిబ్బందిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా తీవ్రవాదులు టార్గెట్ చేసే విధానం, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహానికి సంబంధించి రిటైర్డు ఐపిఎస్ అధికారుల సూచనలు, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ప్రణాళికను సిద్దం చేయనున్నట్లు తెలిపారు. స్టేషన్లలో సీసీ కెమెరాలతో నిఘా ఉంటుందన్నారు.