గంగిరెడ్డి వద్ద రూ.400 కోట్ల ఆస్తులుండొచ్చు: డిజిపి, విలేకరుల ప్రశ్నల వర్షం.. ఇవే..
హైదరాబాద్: అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్, అలిపిరిలో ఏపీ సీఎం చంద్రబాబుపై దాడి ఘటనలో నిందితుడు కొల్లం గంగిరెడ్డిని ఏపీ పోలీసులు ఆదివారం మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. డిజిపి రాముడు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
ఎన్నికల సమయంలో పారిపోయాడు
డిజిపి రాముడు మాట్లాడుతూ... 2014లో ఎర్రచందనం కేసులో గంగిరెడ్డి అరెస్టయ్యాడని, ఆ తర్వాత మే నెలలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో కోర్టు నుంచి బెయిల్ పొందాడని చెప్పారు. అనంతరం ఫేక్ ఐడీ, తప్పుడు ఆధారాలతో విదేశాలకు పారిపోయాడని చెప్పారు. అతని పైన 28 కేసులు ఉన్నాయన్నారు.
గంగిరెడ్డిని తీసుకు రావడంలో తమకు మారిషస్ అధికారులు బాగా సహకరించారని చెప్పారు. గంగిరెడ్డిని అప్పగించడంలో వారు పూర్తి సహకారం చేశారన్నారు. గంగిరెడ్డి భారత్ నుంచి పారిపోయాక ఒక దేశం నుంచి మరో దేశం మారుతూ.. చివరకు మారిషస్ చేరాడన్నారు.
ఓ హత్య కేసులో శిక్ష అనుభవించవలసి ఉంది
గంగిరెడ్డిని తొలుత పొద్దుటూరు కోర్టులో హాజరుపర్చవలసి ఉందన్నారు. అతను ఓ హత్య కేసులో ఇంకా శిక్ష అనుభవించవలసి ఉండగానే బెయిల్ పైన విదేశాలకు పారిపోయాడని చెప్పారు. హత్య కేసులో అతను ఇంకా జైలు శిక్ష అనుభవించవలసి ఉందన్నారు. తాము గంగిరెడ్డిని కేవలం 8 నెలల్లో తీసుకు వచ్చామని చెప్పారు.
గంగిరెడ్డి ఆస్తులు రూ.400 కోట్ల వరకు ఉండొచ్చు
గంగిరెడ్డి దొంగసారా నుంచి హత్యాయత్నం వరకు ఎన్నో కేసులు ఉన్నాయని చెప్పారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా అతను రూ.300 నుంచి రూ.400 కోట్ల వరకు ఉన్నట్లుగా తెలుస్తోందని డిజిపి చెప్పారు. అయితే, ఆయన ఆస్తుల పైన ఈడీ విచారణ చేస్తోందని, అప్పుడే అసలు ఎన్ని ఆస్తులున్నాయో తేలుతుందన్నారు.
అతని వద్ద భారీగానే డబ్బులు ఉన్నాయన్నారు. ఇన్నేళ్ల పాటు అతడు విదేశాల్లో ఉన్నాడంటే ఎంత డబ్బు ఉందో అర్థం చేసుకోవచ్చునని తెలిపారు. నేరం చేసిన వాడు ఎప్పుడో ఓసారి దొరక్కపోడని డిజిపి చెప్పారు. ఇందుకు గంగిరెడ్డే పెద్ద ఉదాహరణ అన్నారు.
పొలిటికల్ మద్దతు ఎంత?
గంగిరెడ్డిని మీడియా ముందు ప్రవేశ పెట్టినప్పుడు డిజిపి రాముడు పైన విలేకరులు ప్రశ్నల వర్షం కురిపించారు. గంగిరెడ్డికి పొలిటికల్ సపోర్ట్ ఎంత వరకు ఉందని ఓ విలేకరి ప్రశ్నించారు. దానికి డిజిపి రాముడు మాట్లాడుతూ... ప్రస్తుతం పొద్దుటూరు కోర్టులో హాజరుపర్చవలసి ఉందని చెప్పారు. ఆయన వెనుక ఎవరు ఉన్నా వదిలేది లేదన్నారు. ఆధారాలు ఉంటే ఆయన వెనుక ఎవరు ఉన్నా వదిలేది లేదన్నారు.
గంగిరెడ్డి పైనే ఇంత ఇంటరెస్ట్ ఎందుకు!?
ఎర్రచందనం స్మగ్లింగ్లో ఐదుగురు వరకు ఉన్నారని, అందులో మిగతా వారిని వదిలేసి గంగిరెడ్డి పైనే ఎందుకు దృష్టి పెట్టారని ఒకరు ప్రశ్నించారు.
దానికి డిజిపి రాముడు స్పందిస్తూ... తమకు ఎవరి పైనా ప్రేమ లేదన్నారు. ఏ ఒక్క టాప్ స్మగ్లర్ను తాము వదిలే సమస్య లేదన్నారు. చిత్తూరు జిల్లాలో ప్రముఖ స్మగ్లర్ ఉన్నారని ఓ విలేకరి చెప్పగా... మాకు ఆధారాలు కావాలని డిజిపి సమాధానం ఇచ్చారు.
మరో టాప్ స్మగ్లర్ సాహుల్ దుబాయ్లో ఉన్నాడని, అతని పైన నిఘా ఉంచామని చెప్పారు. తాము ఏ ఒక్క స్మగ్లర్ను వదిలే సమస్య లేదన్నారు. గంగిరెడ్డిని ఇప్పుడే తీసుకు వచ్చామని, అతనికి ఎవరు సహకరించినా వదిలే ప్రసక్తి లేదన్నారు.
తమిళనాడు స్మగ్లర్ పైన..
తమిళనాడుకు చెందిన ఓ స్మగ్లర్ లొంగిపేయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయని ఓ విలేకరి ప్రశ్నించగా.. దానిని కొట్టిపారేయలేమని చెప్పారు. టాప్ స్మగ్లర్ లిస్టులో మిగిలింది ముగ్గురు నలుగురే అన్నారు.
గంగిరెడ్డికి ప్రాణహానిపై...
ఏపీలో గంగిరెడ్డికి ప్రాణహానీ ఉందని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఓ విలేకరి ప్రశ్నించగా... డిజిపి మాట్లాడుతూ... ప్రాణహానీ ఆయనకా లేదా ఆయన వల్ల ఇతరులకా అని ఎదురు ప్రశ్నించారు. గంగిరెడ్డి పలువురి పైన దాడులు చేశారన్నారు.
ప్రభుత్వం నుంచే ప్రాణహానీ ఉందని వారి ఫ్యామిలీ చెబుతోందని ఓ విలేకరి ప్రశ్నించగా... ఆయనను కోర్టులో ప్రవేశ పెడుతున్నామని, ఆ తర్వాత జైలుకు వెళ్తాడని, ఇక అక్కడ ఆయనకు ప్రాణహానీ ఏమి ఉంటుందని ప్రశ్నించారు. ఇంత పెద్ద నేరం చేసిన వాడు తనకు ప్రాణహానీ ఉందని చెప్పకుండా ఏం చేస్తాడన్నారు.
అసలు బంధువులను వదిలిపెట్టి, ఫేక్ ఐడీతో విదేశాలకు పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. ఇంతటి నేరాలు చేసిన వాడు శిక్షను తప్పించుకునేందుకో, మరో దానికో నన్ను చంపుతారానే చెబుతాడని అన్నారు.
జైల్లో హత్యలు చేసిన సందర్భాలు ఉన్నాయని ఓ విలేకరి ప్రశ్నించగా.... అలా అయితే ప్రధానులను, ఇతర ముఖ్యులను చంపేసిన, దాడి చేసిన సందర్భాలు ఉన్నాయని డిజిపి చెప్పారు. దానికి ఎవరేం చెబుతారన్నారు. గంగిరెడ్డికి జైలు పెద్ద రక్షణ అన్నారు. హైదరాబాదులో ఎర్రచందనం లింక్స్ పైన విచారణలో తేలుతుందన్నారు.