గన్నవరం ఎయిర్ పోర్ట్ ఘనత: 'వల్లభనేని వంశీపై నమ్మకంతో త్యాగం'
గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ స్థాయి హోదా రావడంపై టిడిపి నేతలు హర్షం వ్యక్తం చేశారు.
విజయవాడ: గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ స్థాయి హోదా రావడంపై టిడిపి నేతలు హర్షం వ్యక్తం చేశారు. మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ, మరో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు విమానాశ్రయ ప్రాంగణంలో వేడుకలు నిర్వహించారు.
గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా, మోడీ ట్వీట్
రాష్ట్ర విభజన బాధాకరమే అయినా..
రాష్ట్ర విభజన బాధాకరమే అయినప్పటికీ ఇప్పుడు ఏపీలో జరుగుతున్న అభివృద్ధి చూస్తుంటే అంతా మనమంచికేనని అనిపిస్తుందని ఎంపీ కొనకళ్ల అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు చొరవతో పాటు కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు వల్ల త్వరితగతిన అభివృద్ధి చేసుకుంటున్నామని, ట్రాస్టిస్ట్ టెర్మినల్ను పొందగలిగామన్నారు.
త్వరగా అంతర్జాతీయ హోదా
విమానాశ్రయానికి చాలా తొందరగా అంతర్జాతీయ హోదా వచ్చిందని, అందుకు కేంద్రానికి కృతజ్ఞతలు అని కొనకళ్ల అన్నారు. దీని ద్వారా ఇక్కడి నుంచి ఇతర దేశాలకు వెళ్లేవారు, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేవారికి ప్రయాణం సులువవుతుందన్నారు. హజ్ యాత్రికుల కోసం పాత టెర్మినల్ భవనాన్ని కేటాయించేలా నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే కృషి
గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రైతులను ఒప్పించి భూములను స్వచ్ఛందంగా ఇచ్చేలా కృషి చేశారని కొనకల్ల అన్నారు.
సెంటిమెంట్ కానీ.. వంశీపై నమ్మకంతో త్యాగం
రాష్ట్ర విభజన జరిగిన మూడేళ్ల కాలంలోనే చరిత్ర సృష్టిస్తూ ఈ ప్రాంతం అభివృద్ధి సాధించిందని, అందుకు విమానాశ్రయం అభివృద్ధే నిదర్శనమని ఎంపీ కేశినేని నాని అన్నారు. కోస్తా ప్రాంతంలో స్థలం, పొలం అంటే సెంటిమెంట్గా భావించే ప్రజలు ఎక్కువగా ఉంటారని చెప్పారు. అలాంటిది స్థానిక ఎమ్మెల్యే వంశీపై నమ్మకంతో సీఎం చంద్రబాబు పిలుపుతో రైతులు 750 ఎకరాలను విమానాశ్రయం అభివృద్ధికి త్యాగం చేశారన్నారు.
ఆగస్ట్ నుంచి ఏ దేశానికైనా..
కేవలం పదకొండు నెలల్లో రికార్డు స్థాయిలో ట్రాస్టిస్ట్ టెర్మినల్ను కట్టుకోగలిగామని కేశినేని నాని అభిప్రాయపడ్డారు. విమానాశ్రయం అభివృద్ధికి కేంద్రం ఇప్పటికే రూ.130 కోట్లు కేటాయించిందని, మరో రూ.560 కోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు. ఆగస్టు నుంచి అమరావతి నుంచి ఏ దేశానికైనా వెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయి హోదాతో గన్నవరం విమానాశ్రయం ఏపీకి ముఖద్వారంగా మారుతుందన్నారు.