ఇంటూరి రవికిరణ్ ఇష్యూ: రూటు మార్చిన చంద్రబాబు ప్రభుత్వం
పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టులకు ఇంటూరి రవి కిరణ్ వ్యవహారాన్ని లాగడంలో ఉన్న చిక్కులను గుర్తించి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రూటు మార్చింది.
విజయవాడ: పొలిటికల్ పంచ్ నిర్వాహకుడు ఇంటూరి రవి కిరణ్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం రూటు మార్చినట్లు కనిపిస్తోంది. చంద్రబాబుపై, ఆయన కుమారుడు నారా లోకేష్పై సెటైర్లు వేసినందుకు రవి కిరణ్ను అరెస్టు చేసినట్లు తొలుత చెప్పారు. అయితే, సోషల్ మీడియాలో తీవ్రమైన వ్యతిరేకత రావడంతో రూటు మార్చినట్లు కనిపిస్తున్నారు.
పెద్దల సభను కించపరిచినందుకే రవి కిరణ్ చర్యలు ఉంటాయనే వాదనను ముందుకు తెస్తున్నారు. ఆయన వ్యవహారాన్ని చట్టసభల్లోనే తేల్చాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. రవికిరణ్ను శాసన మండలికి పిలిపించి శిక్ష పడేలా చేయాలని చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రవికిరణ్పై కేసు పెట్టి కోర్టులో విచారించే క్రమంలో ఎదుయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకుని చట్ట సభలకు ఉన్న విస్తృత అధికారాలను ఉపయోగించి శిక్ష వేయాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. అందుకే, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ఇంటర్నెట్లో పొలిటికల్ పంచ్ పేరిట కార్టూన్ వేసిన ఇంటూరి రవికిరణ్ వ్యవహారాన్ని చట్ట సభలకు నివేదించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించినట్లు చెబుతున్నారు.
పొలిటికల్ పంచ్ కార్టూన్ విషయంలో రవికిరణ్ను అదుపులోకి తీసుకోవడంపై ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తోందంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా సోషల్ మీడియాలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఈ కేసులో దర్యాప్తు చేసి నివేదికను మరో రెండు, మూడు రోజుల్లో శాసనసభ కార్యదర్శికి ఇవ్వాలని పోలీస్ యంత్రాంగం నిర్ణయించింది.
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అసెంబ్లీలో జరిగిన ఒక ఘటనను ఇక్కడ ఉదహరిస్తున్నారు. లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణపై అసెంబ్లీ ప్రాంగణంలో దాడి చేసిన ఒక వ్యక్తికి అప్పటి స్పీకర్ నెలరోజులు జైలు శిక్ష విధించిన విషయాన్ని గుర్తు చేస్తూ అదే పద్ధతిలో రవికిరణ్ వ్యవహారాన్ని తేల్చాలని అనుకుంటున్నారు.