ఏపీ వైపు పెట్టుబడిదారులు కన్నెత్తి చూడటం లేదట... అందుకు సాక్ష్యం నీతిఆయోగ్ నివేదికట !!
ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. తద్వారా ఏపీలో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పుకొస్తోంది. అయితే ఏపీ లో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదని, పెట్టుబడిదారులు ఏపీ వైపు కన్నెత్తి చూడటం లేదని రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శిస్తున్నారు.దక్షిణాదిలో ప్రగతిలో రాష్ట్రం చిట్టచివర్లో ఉండటం ఏపీ దురదృష్టమని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రగతి పతనావస్థకు చేరుకుందని ఇందుకు నీతిఆయోగ్ అసాధ్యమని మాజీ మంత్రి యనమల పేర్కొన్నారు .
ఇక నీతి ఆయోగ్ నివేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పదో స్థానంలో నిలిచిందని. దక్షిణాది రాష్ట్రాలలో చిట్టచివరి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలవడం ఏపీ ప్రగతిని చెప్పకనే చెబుతోందని ఆయన ఎద్దేవా చేశారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో సులభతర వాణిజ్యం తోనే దేశంలో మొదటి స్థానంలో నిలిచామని యనమల రామకృష్ణుడు గుర్తు చేశారు. పెట్టుబడిదారులను, పారిశ్రామికవేత్తలను ఆకర్షించి పెట్టుబడులు పెట్టించడానికి గత ప్రభుత్వం చేస్తున్న కృషి ఎంతో ఉందని ఆయన తెలిపారు. ఇక ఇప్పుడు పరిస్థితి దారుణంగా తయారైందని జగన్ హయాంలో తలసరి ఆదాయం 17000 కు పడిపోయిందని తీవ్ర విమర్శలు చేశారు యనమల.
ఏపీలో ఎలాంటి పెట్టుబడులు పెట్టాలన్నా ఎవరూ ముందుకు రావడం లేదని, ఇక ఉద్యోగ ఉపాధి అవకాశాల విషయం పట్టించుకునే నాధుడే లేడని ఆయన పేర్కొన్నారు. ఏపీలో ఆర్థిక అభివృద్ధి లేదని స్పష్టం అవుతుందని పేర్కొన్న యనమల రామకృష్ణుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం వైసిపి హయాంలో కుదేలైందని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అర్థమయ్యేలా చెప్పాలని యనమల రామకృష్ణుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.