కుదరదంటున్న గడ్కరీ!: అలా చేస్తే రాష్ట్రానికి దెబ్బే, పోలవరంపై ఏం చేద్దామన్న ఆలోచనలో బాబు
ట్రాన్స్ట్రాయ్ నుంచి రూ.1000 కోట్ల విలువైన పనులను తప్పించేందుకు ఆయన అంగీకరించలేదు.
Recommended Video
అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం పనులను ప్రధాన కాంట్రాక్టుదారుకే కాకుండా వేరే కాంట్రాక్టరుకు కూడా అప్పగించాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ మేరకు ప్రధాన కాంట్రాక్టు సంస్థ అయిన ట్రాన్స్ట్రాయ్ నుంచి కొన్ని కీలక పనులను తప్పించే యోచనలో ఉన్నారు సీఎం చంద్రబాబు.
విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగొచ్చిన ఆయన రాష్ట్ర జలవనరుల మంత్రి దేవినేని ఉమ, కార్యదర్శి శశిభూషణ్కుమార్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం ఎస్ఈ రమేశ్బాబు పోలవరంపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
చంద్రబాబుకు గడ్కరీ షాక్: రాయపాటి అసంతృప్తి
శుక్రవారం నాటి భేటీలో ఈ నెల 25న ఢిల్లీలో కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీతో జరిగిన సమావేశ వివరాలను మంత్రి దేవినేని ఉమ, కార్యదర్శి శశిభూషణ్కుమార్ సీఎంకు వివరించారు. దీనిపై శనివారం మరోసారి భేటీ అయి ఏం చేయాలనే దానిపై తుది నిర్ణయం తీసుకుందామన్నారు.
సీబీఐ దర్యాప్తకు ఆస్కారం?
కాంట్రాక్టరును మారిస్తే పోలవరం అంచనా వ్యయం భారీగా పెరిగే అవకాశమున్నందునా.. కేంద్రం అందుకు సుముఖంగా లేదని నితిన్ గడ్కరీ చెప్పినట్టు మంత్రి దేవినేని సీఎంకు తెలిపారు. అంచనా వ్యయాలను పెంచుకుంటూ పోతే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తప్పుపట్టవచ్చునని, సీబీఐ విచారణకు కూడా దారితీయవచ్చునని గడ్కరీ తమతో చెప్పినట్టు పేర్కొన్నారు.
గడ్కరీ సలహా:
సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసి పదవీవిరమణ చేసిన ఆర్థిక రంగ నిపుణుడు, రిటైర్డ్ బ్యాంకు అధికారితో పోలవరంపై ఆర్బిట్రేషన్ కమిటీ వేయాలని గడ్కరీ సూచించారు. ట్రాన్స్ట్రాయ్ నుంచి రూ.1000 కోట్ల విలువైన పనులను తప్పించేందుకు ఆయన అంగీకరించలేదు. ఆ పనులను వేరే కాంట్రాక్టర్లకు అప్పగించడం కుదరదన్నారు.
ఆ భారం రాష్ట్రమే భరించాలి:
ఈ- టెండర్లను పిలిస్తే.. ట్రాన్స్ట్రాయ్ కోట్ చేసిన -14.05 శాతం కంటే ఎక్కువ ధరను చెల్లించేందుకు కేంద్రం సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని స్పష్టం చేశారు అని వివరించారు.
సబ్ కాంట్రాక్టర్లకు నేరుగా చెల్లింపులు
వేరే కాంట్రాక్టరును పెట్టుకునే బదులు.. ప్రభుత్వమే ట్రాన్ స్టాయ్ కు సహకరించాలని గడ్కరీ సూచించడం గమనార్హం. ట్రాన్స్ ట్రాయ్ నుంచి చెల్లింపులు సరిగా జరగటంలేదని సబ్ కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. వారికే నేరుగా చెల్లింపులు జరిపేందుకు వీలుగా ఎస్ర్కో ఖాతా తెరవాలని సూచించారు.
దోబూచులాట
పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును విభజన చట్టంలో చేర్చారని, ప్రాజెక్టు పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు. కేంద్రం సకాలంలో నిధులు ఇవ్వకపోవడం, రాష్ట్రం కేంద్రానికి లొంగి ఉండడంతో ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు.