ఫిల్మ్ నగర్ భూకేటాయింపుల్లో అక్రమాలు: అక్బరుద్దీన్
హైదరాబాద్: ఫిల్మ్ నగర్ భూకేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ గురువారం అన్నారు. హైదరాబాదులో సొసైటీలకు భూకేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఆయన శాసన సభ దృష్టికి తెచ్చారు.
భూకేటాయింపుల్లో చోటుచేసుకున్న అక్రమాలను నిగ్గు తేల్చేందుకు సభాసంఘం సరిపోదని, న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. భూకేటాయింపుల వ్యవహారానికి సంబంధించి ఎక్కడ వేలు పెట్టినా వందల కోట్ల రూపాయల అవినీతి వెలుగు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
సభా సంఘం ఆధ్వర్యంలో జరిగే విచారణలో పూర్తి వాస్తవాలు వెలుగు చూసే అవకాశం లేదన్నారు. రిటైర్డ్ న్యాయమూర్తితో న్యాయ విచారణకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. అక్రమాలను నిగ్గుతేల్చడంతో పాటు అక్రమార్కులపై చర్యలు కూడా సత్వరమే తీసుకునేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
రూల్ 74 కింద భూముల కేటాయింపు పైన నోటీసు ఇచ్చిన అక్బర్ సభలో మాట్లాడారు. జూబ్లీహిల్స్, నందగిరి సొసైటీ తదితర సంస్థలకు భూకేటాయింపుల పైన సమాచారం ఇవ్వాలన్నారు. గృహ నిర్మాణ సొసైటీలకు వక్భ్ భూములు కూడా కేటాయించారని ఆరోపించారు.
208 ఎకరాల భూకేటాయింపుల్లో అక్రమాలు జరిగాయన్నారు. రాష్ట్రమంతటా వక్ఫ్ భూములు కబ్జాలకు గురవుతున్నాయని, కొన్నిచోట్ల వక్ఫ్, కొన్నిచోట్ల ప్రభుత్వం స్థలం అంటున్నారని, సొసైటీకి సొసైటీకి భూకేటాయింపుపై ప్రభుత్వ వివరణ సరిగా లేదన్నారు.
ప్రభుత్వ ప్రకటనలోను సర్వే నంబర్లు ఇవ్వలేదన్నారు. ఫిల్మ్ నగర్ సొసైటీలో అక్రమాలు జరిగినట్లు విచారణ అధికారు చెప్పారన్నారు. విచారణ అధికారి నివేదికను ఎందుకు బహిర్గతం చేయడం లేదన్నారు. అక్రమాలు జరిగిన సొసైటీల్లోను భూములను ప్రభుత్వం తీసుకోవాలన్నారు.