ఇక మోడీతో బాబు ఢీ నేనా...అందుకేనా సీ ప్లేన్ మీద అదే స్టయిల్లో...
Recommended Video
అమరావతి: ఈ మధ్య ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేసినా సెన్సేషన్ అవుతోంది. బుధవారం చంద్రబాబు సీ ప్లేన్ మీద చక్కర్లు కొట్టారు. అయితే ఇప్పుడు ఆ షికారే సంచలనం సృష్టిస్తోంది. అందులో ఏముంది నిన్న గుజరాత్ లో మోడీ కూడా చేశారుగా అంటారా...మరి అదేనండీ సరిగ్గా ఆ పాయింటే ప్రస్తుతం ఎన్నోచర్చలకు ఆస్కారమిస్తోంది...
ప్రధాని మోడి గుజరాత్ ఎన్నికల ప్రచారం సందర్భంగా సీ ప్లేన్ లో విహరించి 24 గంటలన్నా కాలేదు. అంతలోనే ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా విజయవాడలో అదే పని చేసి వార్తల్లో కెక్కారు. పైగా చంద్రబాబు కూడా సేమ్ టు సేమ్ మోడి సీ ప్లేన్ మీద ఏ స్టయిల్లో నిలబడ్డారో అచ్చంగా అదే మోడల్లో తాను కూడా ఫోటోలకు ఫోజులిచ్చేశారు. అయితే అందులో ఏముందంటారా? ఇదంతా యాధృచ్ఛికంగా జరిగుండొచ్చు అనుకుంటున్నారా? కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం అలా అనడం లేదు. దీని వెనుక పెద్ద ప్లానే ఉందంటున్నారు.
మోడీ తో ఢీ...
చంద్రబాబు ఇటీవలి కాలంలో మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న హెచ్చరికలు చూస్తే అంతకుముందు బాబు మాట్లాడే విధానానికి ఇప్పటికి తేడా స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పోలవరం విషయంలో కేంద్రం వైఖరి, రిజర్వేషన్ ల పై మోడీ వ్యాఖ్యల అనంతరం చంద్రబాబు తీవ్రంగా ఆలోచించి ఏదో కృతనిశ్చయానికి వచ్చినట్లు కనబడుతోందనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఇక నుంచి మోడీ ఢీ కొట్టాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు ఆయన మారిన తీరును బట్టి అర్థమవుతోందంటున్నారు వారు.
మాటల్లో మార్పు...
పోలవరం విషయంలో కేంద్రం వైఖరి, ఆ తరువాత రిజర్వేషన్ల మీద మోది వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు తన సలహాదారులతో తీవ్రంగా చర్చించినట్లు సమాచారం. మోడీ కంటే సీనియర్ అయిన తన పట్ల మోదీ వ్యవహరిస్తున్న తీరు పట్ల చంద్రబాబుకు అసంతృప్తి ఉండటం సహజం. ఇక ఈ పరిస్థితుల్లో నాన్చుడి ధోరణితో వ్యవహరిస్తే అన్నివిధాలా నష్టమని ఇక తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమయిందని సలహాదారుల సమాలోచనల్లో నిర్ణయం జరిగిందట. అందుకే చంద్రబాబు ఈ మధ్య తన మాటల్లో దూకుడు తీవ్రత బాగా పెంచడమే కాదు తాను ఎప్పుడూ వాడని పదాలను సైతం ప్రయోగిస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ప్రత్యర్థులకు తీవ్ర హెచ్చరికలు...
పోలవరం విషయంలో ఎంతవరకైనా వెళతానని, అడ్డొస్తే ఎవరిని వదలనని, ఇంకా ఏం లెక్కలు కావాలని, తనది ఉడుం పట్టని... ఇలా ఎప్పుడూ లేనివిధంగా చంద్రబాబు హెచ్చరికలు జారీ చేయడం పరోక్షంగా మోడీని ఉద్దేశించేనని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. కారణం పోలవరం విషయంలో జగన్ విమర్శలు చేస్తున్నా అతడు ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రభావితం చెయ్యగలిగేది ఏమీ లేదనేది అందరికి తెలిసిన విషయమే. మోడీ నుంచి తనకు ఎదురవుతున్న ప్రతికూల ఘటనల విషయంలో తాడో పేడో తేల్చేసేందుకు పోలవరం ప్రాజెక్టు వ్యవహారాన్నే వాడుకోవాలని చంద్రబాబు నిర్ణయించి ఉంటారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
గడ్కరీతో సమావేశంతో...
పోలవరంపై గడ్కరీతో సమావేశం తరువాత అసలు ఎపి ప్రభుత్వం పట్ల, తన పట్ల కేంద్రం వైఖరి, మోడీ వైఖరి ఏంటో ఒక నిర్ణయానికి రావచ్చని చంద్రబాబు ఆలోచించారట. ఆ సమావేశంలో తన పట్ల సానుకూల వైఖరి కనబరిచే ఉద్దేశమే కేంద్రానికి లేకపోతే చంద్రబాబు ఇక యుద్ధానికి సన్నద్దం అవ్వడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకే పక్కా ప్లాన్ ప్రకారమే సీ ప్లేన్ విహారంతో ఒక ఇండికేషన్ హెచ్చరిక జారీ చేశారని, అదికూడా పోలవరంపై కేంద్రంతో సమావేశానికి ముందే అలా చెయ్యడం గమనించాలని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
దానికి దీనికి ఏం సంబంధం...
మోడీ లాగా సీ ప్లేన్ లో విహరిస్తే ఆయనను ఢీ కొట్టేందుకు సిద్దమని చంద్రబాబు ఎలా చెప్పినట్లనే సందేహం సాధారణంగా కలగొచ్చని, అయితే రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన చంద్రబాబు ఏం చేస్తే ఏం జరుగుతుందనే విషయం అంచనా వెయ్యడంలో మిగతా పొలిటీషియన్ల కన్నా చాలా ముందే అంచనా వెయ్యగలరని ఆయన గురించి బాగా తెలిసినవారు చెప్పే మాట. ప్రధాని మోడి సీ ప్లేన్ లో చక్కర్లు కొట్టిన ఒక రోజు అంతరం లోనే తాను కూడా అచ్చం అదే సీ ప్లేన్ లో అదే విధంగా చేస్తే ఖచ్చితంగా ఇరువురిని పోల్చడం ఖాయమని చంద్రబాబు అలవోకగా ఆలోచించగలరట. ఆ ఆలోచన, ఆ చర్చ అంతటా జరగాలనేదే చంద్రబాబు కోరిక అయిఉండొచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇకపై మోడీ వర్సెస్ బాబు...
సో...ఇకపై చంద్రబాబులో మరో కోణాన్ని ఎపి ప్రజలు చూసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు ఊహిస్తున్నారు. అవసరమైతే మోడిని ఢీ కొట్టాలనే చంద్రబాబు నిర్ణయించుకొని ఉంటారని, తద్వారానే తన ముందున్న లక్ష్యాలు పూర్తిచెయ్యగలుగుతానని చంద్రబాబు ఇప్పటికే ఇక నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. రాజకీయాల్లో మోడీ కంటే సీనియర్ అయిన చంద్రబాబు చాణుక్య నీతి విషయంలోను తనది పైచేయి అని నిరూపించుకోవాలంటే ఇదే సరైన సమయం అంటున్నారు ఆయన మద్దతుదారులు. అందులోను ఒకవేళ చంద్రబాబు మోడీ ని ఢీ కొట్టదలుచుకుంటే అన్నివిధాలా ఇదే కరెక్ట్ టైమ్ అనేది రాజకీయ విశ్లేషకుల సలహా.
ఇక స్కెచ్ అమలే తరువాయి...
కేంద్ర మంత్రి గడ్కరీతో పోలవరం పై సమావేశం అనంతరం ముందు ముందు కేంద్రంతో వ్యవహరించే విషయమై చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చే ఉంటారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే పోలవరానికి సంబంధించి గంటల వ్యవధిలో సిఈవో నియామకం, నెలల వ్యవధిలో కాంట్రాక్టర్ కొనసాగే విషయం ఆధారపడి ఉన్నందున స్వల్ప విరామంతో చంద్రబాబు తన స్కెచ్ అమలు చేయడం ప్రారంభించవచ్చని రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.