చంద్రబాబు చేతికి జగన్ అస్త్రం - "యూ టర్న్" నిర్ణయాలు..!! విశ్వసనీయత పై ఎఫెక్ట్..!!
నాడు వైఎస్సార్..నేడు జగన్. ఇద్దిరిదీ ప్రజల్లో ఒకటే నినాదం. విశ్వసనీయత. 2019 ఎన్నికల్లో జగన్ ను ఇదే నినాదం అధికారంలోకి తెచ్చింది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని..చంద్రబాబు చెప్పింది చేసే అలవాటు లేదంటూ తన పాదయాత్ర మొదలు ఎన్నికల ప్రచారం వరకూ జగన్ పదే పదే ప్రచారం చేసారు. జగన్ ఈ రెండున్నారేళ్ల కాలంలో నవరత్నాల అమలులో మాత్రం ఆర్దికంగా ఎన్ని కష్టాలు వచ్చినా ...మాట నిలబెట్టుకుంటున్నారు. ఇక, పార్టీల పదవుల విషయంలోనూ మాట ఇచ్చిన వారికి కట్టబెడుతున్నారు.

జగన్ చెప్పారంటే చేస్తారంతే..
అయితే, కొద్ది రోజులుగా మాత్రం జగన్ పాలనలో మార్పు కనిపిస్తోంది. తాను మూడు రాజధానుల బిల్లులను తిరస్కరించారనే ఆగ్రహంతో మండలి రద్దు చేస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని...ఇప్పుడు ఉపసంహరించుకుంటూ మరో తీర్మానం చేసారు. ఇది ప్రజలకు ప్రత్యక్షంగా సంబంధించిన అంశం కాకున్నా.. జగన్ ను దగ్గరగా పరిశీలించే వారికి మాత్రం జగన్ వెనుకడుగు వేసినట్లుగానే కనిపిస్తుంది. ఇక, ఎన్నికల సమయంలో జగన్ ఉద్యోగులను తన వైపు తిప్పుకొనేందుకు కీలక హామీలు ఇచ్చారు. తాను అధికారంలోకి వచ్చిన తరువాత 27 శాతం మధ్యంతర భృతి ఇస్తామని చెప్పారు.

ఇచ్చిన హామీల పై సందిగ్దత
చెప్పిన విధంగానే ముఖ్యమంత్రి అయి..తొలి సారి సచివాలయానికి వచ్చిన వేళ ఆ నిర్ణయం ప్రకటించారు. 27 శాతం మధ్యంతర భృతి అమలు చేస్తున్నారు. ఇక, ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి ఇప్పుడు నిర్ణయం తీసుకోనున్నారు. ఇక, ఎన్నికల ముందు ఇచ్చిన మరో కీలక హామీ...సీపీఎ్ రద్దు చేస్తామని చెప్పారు. తాజాగా ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చల్లో భాగంగా సీపీఎస్ గురించి కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా సమాచారం. కంట్రిట్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దుపై తమకు అప్పుడు సాంకేతిక అంశాలు ఏమీ తెలియదని..ఇది అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదని వ్యాఖ్యానించటంతో ఒక్క సారిగా చర్చ మొదలైంది.

అధ్యయనం చేయకుండానే హామీ ఇచ్చారా
అంటే..ఎన్నికల ముందు సీపీఎస్ గురించి పూర్తిగా అధ్యయనం చేయకుండానే హామీ ఇచ్చారా అంటూ విమర్శలు మొదలయ్యాయి. మరి..ఏ రకంగా తాము అధికారంలోకి వస్తే వెంటనే సీపీఎస్ రద్దు చేస్తామంటూ హామీ ఇచ్చారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మాట తప్పరు..మడమ తిప్పరు అనే నినాదానికి ఇప్పుడు పూర్తిగా రివర్స్ గా మాట మార్చుడు.. మాట తిప్పుడు అంటూ లోకేష్ వంటి వారు విమర్శలు చేస్తున్నారు. తన పధకాల అమలు కోసం నిధుల కొరత ఉండదని...ఏపీలో ఆ సమయంలో జరుగుతున్న అవినీతిని తాను అధికారంలోకి వచ్చిన తరువాత నియంత్రిస్తే భారం పడదని చెప్పుకొచ్చారు. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు అధికారం లోకి..జగన్ ప్రతిపక్షంలోకి రావటానికి రెండు శాతం లోపు ఓట్లు మాత్రమే తేడా.

చంద్రబాబు చేతికి అస్త్రంగా
చంద్రబాబు లాగా తాను కూడా రైతు రుణ మాఫీ అంటూ అబద్దం చెబితే అప్పుడు అధికారంలోకి వచ్చేవాళ్లమని వైసీపీ నేతలు పదే పదే వ్యాఖ్యానించారు. ఇక, జగన్ చెప్పారంటే చేస్తారంతే..అనే నినాదం పైన ఎఫెక్ట్ పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చంద్రబాబు తన నిర్ణయాలను మార్చుకుంటూ వెళ్లిన సందర్బంలో వైసీపీ నేతలు యూటర్న్ చంద్రబాబు అంటూ విమర్శలు చేసారు. ఇప్పుడు అదే అస్త్రాన్ని ప్రతిపక్షాలు అందిపుచ్చుకొనే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే ప్రత్యేక హోదా పైన నెమ్మదిగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే కార్యాచరణ అమలు చేస్తున్నారు. దీంతో..వెంటనే స్పందించిన వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరంటూ నినదించారు.

జగన్ విశ్వసనీయత నిలబెట్టుకుంటారా
చంద్రబాబు చెప్పింది చేయరని..జగన్ చెప్పారంటే చేస్తారనే నమ్మకం ప్రజల్లో కలిగేలా ప్రచారం చేసిన వైసీపీ నేతలు..ఇప్పుడు తాజా పరిణామాలతో రాజకీయంగా ఆత్మరక్షణ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాను చంద్రబాబు లాగా కాదు..తాను తానే అని జగన్ నిరూపించకోకుంటే రాజకీయంగా నష్టం తప్పదని..వైఎస్ కుటుంబం ఆయుధంగా చెప్పుకొనే విశ్వసనీయత పైన ఒక సారి ఎఫెక్ట్ పడితే..అది మొత్తంగా పొలిటికల్ ఫ్యూచర్ నే ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి..సీఎం జగన్ ఈ పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకు వెళ్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications