చంద్రబాబు వ్యాఖ్యలు: పొరపాటా, గ్రహపాటా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సుదీర్ఘమైన రాజకీయానుభవం ఉంది. వ్యూహరచనలోనే కాదు, వ్యూహాలను పకడ్బందీగా అమలు చేయడంలో దిట్ట అనే పేరుంది. జాతీయ రాజకీయాల్లో ప్రతిష్ట ఉంది. కేంద్ర ప్రభుత్వం అండదండలు దండిగా ఉన్నాయి. అయితే, అధికారం చేపట్టినప్పటి నుంచీ సమస్యలను ఎదుర్కుంటున్నారు.
అనూహ్యంగా, ఆయన ప్రమేయం లేకుండా ఎదురయ్యే సమస్యలు చాలానే ఉన్నప్పటికీ స్వయంగా కొని తెచ్చుకుంటున్న సమస్యలు ఈ మధ్య కాలంలో పెరిగాయని అంటున్నారు. ఎంతో సహనం, సంయమనం పాటించే చంద్రబాబులో అవి ఇప్పుడు కరువయ్యాయా అనే అనుమానం కలుగుతోందని ఆయనకు అత్యంత సన్నిహితులైనవారే అంటున్నారు.

ఎస్సీ వ్యాఖ్యలు
తాజాగా చంద్రబాబు తాను చేసిన వ్యాఖ్యపై వివాదంలో చిక్కుకున్నారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరూ అనుకోరని ఆయన చేసిన వ్యాఖ్యలు ఎదురు తిరిగాయి. నిజానికి, చంద్రబాబు ఉద్దేశం వైరే ఉండవచ్చు గానీ ఆ వ్యాఖ్యలు దళితులను అవమానించే విధంగా ఉన్నాయనే విమర్శలు పెద్ద యెత్తున వచ్చాయి. అయితే, చంద్రబాబు కులాల ఆత్మగౌరవ పోరాటాలను పరిశీలించి ఉంటే ఆ మాట అని ఉండేవారు కాదు. ఏ కులానికి ఆ కులం ఇప్పుడు తమదే గొప్పదంటూ ఆత్మగౌరవాన్ని చాటుకుంటున్నాయి. దానివల్ల చంద్రబాబు వ్యాఖ్యలు ఎదురు తిరిగాయి.
కృష్ణయ్యపై వ్యాఖ్యలు
ఆర్. కృష్ణయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న ఎల్బీనగర్ శాసనసభా నియోజకవర్గంలో ఓట్లు తక్కువ వచ్చాయని చంద్రబాబు వ్యాఖ్యానించడం కూడా వివాదానికి దారి తీసింది. కాపు రిజర్వేషన్ల సమస్య నలుగుతున్న పరిస్థితిలో బీసీలకు నాయకత్వం వహిస్తున్న కృష్ణయ్యపై చంద్రబాబు ఆ వ్యాఖ్య చేయడాన్ని తప్పు పడుతున్నారు.
నిజానికి, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) దూకుడును తగ్గించడానికి, కాంగ్రెసుపై ఆధిపత్యం సాధించడానికి శాసనసభ ఎన్నికల సమయంలో ఆర్. కృష్ణయ్యను ఎల్బీ నగర్లో పోటీకి దించి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. టిడిపి తెలంగాణలో ఓడిపోవడంతో ఆయనను పట్టించుకోవడమే మానేశారు.

ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆయనను లెజిస్టేచర్ పార్టీ నాయకుడిగా ఎందుకు చేయలేదనే ప్రశ్న ఇప్పుడు మళ్లీ ముందుకు వస్తోంది. ఆయనను చంద్రబాబు నాయుడే కాదు, టిడిపి తెలంగాణ నాయకులు, శాసనసభ్యులు కూడా పట్టించుకోవడం మానేశారు. ఒక రకంగా ఆయన పట్ల అవమానకరంగా ప్రవర్తించారనే విమర్శ కూడా ఉంది.
పులివెందుల కామెంట్స్..
తుని ఘటనలకు పులివెందుల ముఠానే కారణమని చంద్రబాబు పదే పదే అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఆ మాటలు అంటున్నప్పటికీ దాని వల్ల ఓ ప్రాంతం ఆత్మాభిమానం దెబ్బ తినే ప్రమాదం ఉందని అంటున్నారు.
ఇప్పటికే రాయలసీమలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఈ నెల 14వ తేదీ నుంచి ప్రత్యేక రాయలసీమ కోసం బస్సు యాత్ర ప్రారంభం కాబోతోంది. చంద్రబాబు చేసిన పులివెందుల వ్యాఖ్యలు ఉద్యమకారులకు అస్త్రంగా పనికి వస్తుందనే మాట వినిపిస్తోంది.
కెసిఆర్పై అప్పుడు...
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై కూడా తొలుత తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. చంద్రబాబు వ్యవహార శైలికి నొచ్చుకుంటూ కెసిఆర్ పొరుగురాష్టం ముఖ్యమంత్రిగా గౌరవం ఇవ్వాలని తాను అంటున్నట్లు పలుమార్లు చెప్పారు. చివరకు ఓటుకు నోటు కేసుతో చంద్రబాబు కెసిఆర్ పట్ల తన వైఖరి మార్చుకోవాల్సిన స్థితిలో పడ్డారని అంటున్నారు.












Click it and Unblock the Notifications