వైసీపీ కండువాతో రాపాక-అఫీషియల్ ఎంట్రీనా..!! ఆధారం ఇదేనా-అనర్హత అడిగేనా..!!
ఏపీ శాసనసభలో జనసేన ఎమ్మెల్యే ఒకే ఒక్కరు. 2019 ఎన్నికల్లో జనసేన తూర్పు గోదావరి జిల్లా రాజోలు నుంచి మాత్రమే గెలుపొందింది. అక్కడ గెలిచిన రాపాక వరప్రసాద్ తొలి రోజుల్లో శాసనసభ లోనూ.. బయటా పవన్ కళ్యాణ్ ను ప్రశంసిస్తూ పార్టీ ఎమ్మెల్యేగా వ్యవహరించారు. ఆ తరువాత అధికార వైసీపీకి దగ్గరయ్యారు. ముఖ్యమంత్రిని కీర్తిస్తూ అనధికారిక వైసీపీ నేతగా మారారు. ఇక, పవన్ కళ్యాణ్ విభేదించిన అంశాల్లోనూ వైసీపీకి మద్దతుగా నిలిచారు. కానీ, ఆయన అధికారిక లెక్కల ప్రకారం జనసేన ఎమ్మెల్యేగానే ఉన్నారు.
వైసీపీ కండువాతో జనసేన ఎమ్మెల్యే
రాజోలులో వైసీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్గా చలామణి అవుతున్న బొంతు రాజేశ్వరరావు వర్గం, మరో కోఆర్డినేటర్గా ఉన్న పెద పాటి అమ్మాజీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. వీరి మధ్య రాజీకి పార్టీ సీనియర్లు ప్రయత్నించారు. ఇక, ఎమ్మెల్యే రాపాక ఎంట్రీతో మరింత రసవత్తరంగా అక్కడ పరిస్థితి మారింది. అయితే, రాపాక సైతం అనధికారికంగా జనసేన నేతగానే కొనసాగుతున్నారు. పార్టీ పరంగా నిర్వహించే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అయితే, రాపాక వ్యవహారం పైన గతంలో జనసేన అధినేత పవన్ స్పందించారు. ఆయన పైన ఏ రకమైన ఒత్తిడి పని చేసిందో అంటూ వ్యాఖ్యానించారు.
రాపాకపైన చర్యలు జనసేన కోరుతుందా
కానీ, రాపాక పైన చర్యలకు డిమాండ్ చేయలేదు. అదే సమయంలో రాపాక అధికారికంగా వైసీపీలో చేరక పోవటంతో ఆయన పైన చర్చలకు అవకాశం దక్కలేదు. ప్రస్తుతం టీడీపీ నేత పట్టాభి ముఖ్యమంత్రి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా..చంద్రబాబు క్షమాపణ చెప్పాలనే డిమాండ్ తో వైసీపీ జనాగ్రహ దీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆయన వైసీపీ కండువా వేసుకుని కనిపించారు. అనంతరం సన్నిహితుల సూచనతో వైసీపీ కండువా తీసేసినా అప్పటికే ఆయన కండువా వేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అనధికారికంగా ఇప్పటి వరకు
దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు జనసేన పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. కానీ, జనసేన ఇదే అంశం పైన రాపాక మీద చర్యలు కోరుతూ ముందుకు వస్తుందా రాదా అనేది చూడాలి. ఇప్పటికే టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వల్లభనేని వంశీ మోహన్, మద్దాల గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ లాంటి వారు వైసీపీలో అనధికారికంగా కొనసాగుతున్నారు. కానీ, వారి కుటుంబ సభ్యులు సీఎం సమక్షంలో వైసీపీ లో చేరారు. ఎమ్మెల్యేలు మాత్రం అధికారికంగా పార్టీ కండువాలు కప్పుకోలేదు. ఇప్పటి వరకు వైసీపీతో కలిసినా..చర్యలు కోరేందుకు ఆధారాలు లేవని జనసేన నేతలు చెబుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ గా రాపాక కండువా ఫొటోలు
ఇక, ఇప్పుడు అధికారికంగా మెడతో వైసీపీ కండువాతో రాపాక కనిపిస్తున్న ఫొటోలు వైరల్ అవుతుండటంతో దీనిని ఆధారంగా తీసుకోవచ్చనే చర్చ మొదలైంది. జనసేన ఎమ్మెల్యే రాపాక తన మెడలో వైసీపీ కండువాతో ఉన్న ఫొటోలు వైరల్ అవుతుండటం...రాజోలు నియోజకవర్గంలోని పవన్ అభిమానులు..జనసైనికులు చర్యలు తీసుకోవాలంటూ డిమండ్ చేస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు జనసేన అధినాయకత్వం ఏం చేస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. అయితే, జనసేన నేతలు మాత్రం రాపాక ఇప్పుడు వైసీపీ కండువా కప్పుకున్నా..అనధికారికంగా వైసీపీతోనే ఉన్న విషయాన్ని గుర్తించాలని సూచిస్తున్నారు. దీంతో..ఇప్పుడు జనసేన కొత్తగా ఫిర్యాదు చేసే అవకాశం లేదని వారి వ్యాఖ్యలతో అర్దం అవుతోంది.