ఏపీలో ఒకటే చర్చ: టీడీపీ ఎంపీలకు ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ఇస్తారా?
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా విషయంలో తమ వాదన వినిపించుకునేందుకు కాస్తంత సమయం ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోడీకి అదివారం టీడీపీ ఎంపీలు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలకు ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఇస్తారా? ఇవ్వరా? అనే దానిపై రాజకీయవర్గాల్లో సోమవారం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
రాజ్యాంగ నిబంధనల సాకుగా ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం సాధ్యం కాదని రాజ్యసభలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తేల్చేసిన నేపథ్యంలో ఏపీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మిత్రపక్షమైన బీజేపీతో తెగదెంపులు చేసుకునేందుకు కూడా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సిద్దమయ్యారు.
ప్రత్యేకహోదా అంశం రాష్ట్ర ప్రజలకు సెంటిమెంట్గా మారిన నేపథ్యంలో కేంద్రంలో భాగస్వామ్యం అయినప్పటికీ హోదాను సాధించుకోలేక సీఎం చంద్రబాబు ఆదివారం టీడీపీ ఎంపీలు, పార్టీ సీనియర్లతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఒకింత ఆవేదనను కూడా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

తనకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే కొడుకు చెప్పినా విననని సీఎం వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రివర్గం నుంచి బయటికొచ్చే అంశంపై ప్రధాని స్పందనను బట్టి ఆలోచిద్దామన్నారు. ప్రధాని కలిసి హోదా అంశంపై వివరించాక కూడా రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదని, కొన్ని రోజులు చూశాక తదుపరి కార్యాచరణకు సిద్ధమవుదామని అన్నారు.
ప్రభుత్వం నుంచి బయటకు రావాలన్న ప్రతిపాదనపైనా సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీని కలిసి, ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలపై వివరించేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ టీడీపీ ఎంపీలు అపాయింట్ మెంట్ కోరారు. ఈ మేరకు పీఎంఓకు లేఖ రాశారు.
ప్రధాని అపాయింట్మెంట్ లభిస్తే, ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీలను గురించి విన్నవించాలని, ఇవ్వకుంటే పార్లమెంటులో నిరసనలు తెలపాలని పార్టీ అధినేత చంద్రబాబు ఆదివారం జరిగిన సమావేశంలో ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. సోమవారం లోక్సభ జరిగిన తీరు చూస్తే చంద్రబాబు సూచనను టీడీపీ ఎంపీలు చక్కగా పాటించనట్టే కనిపించారు.
సభ ప్రారంభం నుంచి కూడా ప్లకార్డులు చేతబూని సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. లోక్సభను వాయిదా కూడా వేయించిన సంగతిని మనం చూశాం. ఇక ప్రధాని అపాయింట్ మెంట్ విషయానికి వస్తే సాధారణంగా ఎంపీలు కోరగానే అపాయింట్ మెంట్ లభిస్తుంది.
కానీ ప్రస్తుతం ఏపీకి ప్రత్యేకహోదా అంశం ఢిల్లీ రాజకీయాలను కూడా ప్రభావితం చేశాయి. టీడీపీ ఎంపీలను కలిసే ఉద్దేశం ప్రధాని మోడీకి లేనట్టుగా ఉందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అపాయింట్ మెంట్ ఇచ్చినా ప్రత్యేకహోదా అంశాన్ని దాటవేసే ప్రయత్నం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను తమకు అనుకూలంగా మలచుకోవాలని కాంగ్రెస్, వైసీపీలు భావిస్తున్నాయి. హోదాపై చంద్రబాబు చేసిన 'సంజీవని' వ్యాఖ్యల వల్లే కేంద్రం ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే విషయంలో కేంద్రం తాత్సారం చేస్తోందని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాయి.
మరోవైపు కేసులకు భయపడే ఆయన కేంద్రంతో రాజీపడ్డారని, అందువల్లే హోదాపై ఒత్తిడి తేవడం లేదని వైసీపీ అధినేత వైయస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. చంద్రబాబు వైఖరికి వ్యతిరేకంగా ఆగస్టు 2న ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్ను ఎలాగైనా విజయవంతం చేయాలని ఆలోచనలో వైసీపీ వర్గాలు ఉన్నాయి.
రాష్ట్ర ప్రజల్లో సైతం ఈ విధమైన అభిప్రాయం పెరుగుతున్ వేళ, కేంద్రంపై ఒత్తిడిని ఎలా పెంచాలన్న ఆలోచనలో చంద్రబాబు పార్లమెంట్లో వ్వవహరించాల్సిన తీరుపై వ్యూహాలు పన్నుతున్నారు. టీడీపీ ఎంపీలు కోరిన ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ విషయమై ఇంకా స్పష్టత రాలేదు.












Click it and Unblock the Notifications