వాట్ నెక్స్ట్: వైసీపీ ఫ్యూచర్ స్ట్రాటజీ?, మళ్లీ అదే తప్పా.. టీడీపీకి అది ప్లస్!
సర్దిపుచ్చుకోవడానికో.. సమర్థించుకోవడానికో మాత్రమే పరిమితమైపోతే చేజేతులా భవిష్యత్తునూ సందిగ్దంలోకి నెట్టుకున్నట్లే.
Recommended Video

కర్నూలు: రాజకీయాల్లో గెలుపోటములు సహజమే. కానీ వాటి నుంచి పాఠాలు నేర్చుకోకపోతే మాత్రం భవిష్యత్తుపై దాని ప్రభావం గట్టిగానే ఉంటుంది. సర్దిపుచ్చుకోవడానికో.. సమర్థించుకోవడానికో మాత్రమే పరిమితమైపోతే చేజేతులా భవిష్యత్తునూ సందిగ్దంలోకి నెట్టుకున్నట్లే.
ఏపీలో వైసీపీ పరిస్థితి ఇప్పుడిలాగే తయారైందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. నంద్యాల ఓటమిపై ఆ పార్టీలో స్వీయ విశ్లేషణ జరిగిందా? అంటే కాదనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. అధికార పార్టీ ప్రలోభాలే టీడీపీని గెలిపించాయే తప్ప.. తమలో ఎలాంటి లోపం లేదనే రీతిలో ఆ పార్టీ ముందుకు వెళ్తుండటం మున్ముందు మరిన్ని గడ్డు పరిస్థితులకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.

సమాలోచన ఏది?
నంద్యాల ఉపఎన్నికను వైసీపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అందరికీ తెలిసిందే. ఇక్కడ గెలిచి ఉంటే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోను ఈ తీర్పే రిపీట్ అవుతుందని ఆ పార్టీ కూడా చెప్పుకునేదే. కానీ నంద్యాల ఓటర్లు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. దీనికి కారణం.. అధికార దుర్వినియోగంతో టీడీపీ సాగించిన బెదిరింపులు, ప్రలోభాలు, డబ్బు పంపిణీ అనేది వైసీపీ వాదన.
కానీ లోతుగా చర్చిస్తే.. వైసీపీ స్వీయ తప్పిదాలు కూడా బయటపడుతాయి. ఈ విషయాన్ని పక్కనపెట్టి జగన్ పార్టీ ముందుకు వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. ఓటమి తర్వాత నేతలతో సమాలోచనలు జరపకుండా, లోటు పాట్లపై ఒక స్వీయ విశ్లేషణ జరగకుండా ముందుకెళ్లాలనుకోవడం ఆ పార్టీ చేస్తున్న మరో వ్యూహాత్మక తప్పిదమనే చెబుతున్నారు.

భవిష్యత్ కార్యాచరణ:
ఎంతసేపు ప్రత్యర్థి పార్టీని విమర్శించడానికే జనంలోకి వెళ్తున్నారు తప్పితే.. పార్టీ పరిస్థితులను కూడా జగన్ సమీక్షించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ భవిష్యత్తు కార్యాచరణ కూడా దానికి బలం చేకూర్చేలా తయారైందనే వాదన వినిపిస్తోంది.
సెప్టెంబర్ 3 నుంచి 9 వరకూ నియోజక వర్గాల ఇన్ఛార్జ్ లకు వైసీపీ శిక్షణ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే వైయస్సార్ కుటుంబం పేరుతో ఓ కొత్త కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారట. జనంలో చంద్రబాబు వైఫల్యాలను ఎండగట్టేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లుగా చెబుతున్నారు.
అటు తర్వాత గుంటూరు ప్లీనరీలో ప్రకటించిన నవరత్నహామిలపై కూడా విజయశంఖారావం అనే సభ నిర్వహించబోతున్నారు. ఆపై అక్టోబర్ నెలలోనే ఇడుపాలయ నుంచి జగన్ పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్న సంగతి తెలిసిందే.

మళ్లీ అదే తప్పు చేస్తారా?:
హద్దు దాటిన విమర్శలు నంద్యాలలో వైసీపీకి ఎలాంటి రుచి చూపించాయో తెలిసిందే. ఇప్పుడు మరోసారి జనంలోకి వెళ్లడానికి సిద్దమైన వైసీపీ.. తిరిగి అదే తప్పులను చేయబోతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సైద్దాంతిక విమర్శను పక్కనపెట్టి.. పాత ధోరణిలోనే చంద్రబాబును టార్గెట్ చేసుకుంటూ పోతే లాభం కన్నా నష్టమే ఎక్కువగా జరుగుతుందన్న ప్రచారం జరుగుతోంది.

పీకేపై అసంతృప్తి, టీడీపీకి ప్లస్:
ప్రశాంత్ కిశోర్ రిపోర్టులపై అసంతృప్తితో ఉన్న నేతలను నంద్యాల ఉపఎన్నికలు ఫిరాయింపు దిశగా ప్రోత్సహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.పీకే ఇచ్చే రిపోర్టుల ఆధారంగా తమ శక్తి సామర్థ్యాలను అంచనావేయడం క్షేత్ర స్థాయిలో చాలామంది వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట.
తమ అభిప్రాయాలను పట్టించుకోకుండా పీకేకె ప్రాధాన్యం ఇవ్వడం వారికి మింగుడుపడటం లేదని తెలుస్తోంది. ఇదే అదునుగా భావిస్తున్న టీడీపీ ఈ అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించే అవకాశం లేకపోలేదు. నంద్యాల ఫలితం తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ మరోసారి తెర పైకి వచ్చే అవకాశం ఉండటంతో.. టీడీపీ గాలానికి ఎంతమంది వైసీపీ నేతలు చిక్కుతారోనన్న చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications