ఊహాగానాలా..! నిజాలా..! : 'పార్టీ జంపింగ్ లో రోజా'
విజయవాడ : ఊహాగానాలో..! నిజాలో..! తెలియదు గానీ ప్రస్తుత ఏపీ పాలిటిక్స్ లో వైసీసీ ఎమ్మెల్యే ఆర్కే రోజా పార్టీ మార్పు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకుని, సందర్భం వచ్చిన ప్రతిసారి అధికార పక్షం టీడీపీ పై మాటల యుధ్దానికి దిగే రోజా ప్రస్తుత వ్యవహార శైలి ఇందుకు పూర్తి భిన్నంగా ఉండడమే రాబోయే రోజుల్లో ఆమె పార్టీ మారవచ్చనే వాదనలను తెరపైకి తీసుకొస్తోంది.
ఓవైపు జగన్ చంద్రబాబుపై చేసిన చెప్పు వ్యాఖ్యల పట్ల టీడీపీ నేతలు మూకుమ్మడిగా కౌంటర్ ఎటాక్ చేస్తున్నా..! ఎప్పుడూ పార్టీ తరుపున అధికార పక్షం వ్యాఖ్యలను తిప్పికొట్టే రోజా మాత్రం ఈ విషయంలో మౌనంగా ఉంటూ వస్తున్నారు. అదీగాక, వైసీపీ ముందునుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నా..! చిత్తూరు జిల్లాలో గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన నవనిర్మాణ దీక్షకు కూడా రోజా హాజరవడం అధికార పార్టీతో ఆమె టచ్ లోకి వెళ్తున్నారా..! అన్న సందేహాలను రేకెత్తిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే, అటు జగన్ రైతు భరోసా యాత్రలకు కూడా ఎమ్యెల్యే రోజా దూరంగా ఉండిపోవడం, చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో.. ఫైర్ బ్రాండ్ తరహాలో కాకపోయినా, కనీస మాత్రంగానైనా అధికార పక్షం వైఫల్యాలపై రోజా నోరు మెదకపోవడం వంటి ఆమె అంశాలు ఆమె రాజకీయ భవిష్యత్తు వైసీపీతోనే కొనసాగుతుందా..! లేక మిగతా నేతల్లాగే గతాన్ని మర్చిపోయి టీడీపీ గూటికి చేరిపోతారా..! అన్న సంశయాలను కలిగిస్తోంది.
నిజంగా ఇదే జరిగితే.. 'రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులంటూ ఎవరూ ఉండరు' అన్న మాటకు రోజా ఉదంతమే బెస్ట్ ఉదాహరణగా మిగిలిపోతుంది. అసలే అనిశ్చితికి కేరాఫ్ గా మారిపోయిన నేటి రాజకీయాల్లో.. తెల్లారేసరికే పార్టీ కండువాలు మార్చుకుంటున్న నేతల వ్యవహారం కళ్లముందు కదలాడుతూనే ఉంది. ఇక ఇప్పుడు రోజా వంతు వచ్చిందన్న ఈ ఊహాగానాలు ఇక్కడికే పరిమితమవుతాయో..! లేక ఊహాగానాలను నిజం చేసే దిశగా రోజా భవిష్యత్తు రాజకీయాలు సాగుతాయో..! తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.