ముద్రగడలో అసహనం: చంద్రబాబుకు మరో లేఖాస్త్రం
కాకినాడ: తన దీక్ష విరమణకు ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చకపోడం పట్ల కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీవ్ర అసహనానికి గురైనట్లు కనిపిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆయన తాజాగా బుధవారం ఓ లేఖాస్త్రం సంధించినట్లు సమాచారం.
దీక్ష విరమించి వారం రోజులకు పైగా గడిచినప్పటికీ హామీల అమలుకు చంద్రబాబు చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆయన ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. కెఎల్ మంజునాథ్ కమిషన్ పనిచేయడానికి అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని ఆయన తాజా లేఖలో చంద్రబాబును కోరారు. మంజునాథ్ కమిషన్ పనిచేసినప్పుడు మాత్రమే సకాలంలో నివేదిక సమర్పించడానికి వీలవుతుందనేది తెలిసిన విషయమే.
ఫిబ్రవరి 8వ తేదీన హైడ్రామా మధ్య ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించారు. అయితే, మంజునాథ్ కమిషన్ పనిచేయడానికి వీలుగా మిగతా సభ్యులను ఇప్పటి వరకు కూడా నియమించలేదు. కమిషన్లో తాను సూచించిన కాపు నాయకుడికి ఒకరికి స్థానం కల్పించాలని ఆయన కోరారు. ఆయన సభ్యుడి పేరును కూడా సూచించారు.
దానికితోడు, కమిషన్ టర్మ్స్ ఆప్ రెఫెరెన్స్ను నోటిఫై చేయాల్సి ఉంది. కమిషన్ సభ్యుల నియమాకం, టర్స్స్ ఆఫ్ రెఫరెన్స్ను నోటిఫై చేస్తే తప్ప కమిషన్ పనిచేయడానికి కుదరదు. ఈ రెండు విషయాలపై ఇప్పటి వరకు చంద్రబాబు దృష్టి పెట్టకపోవడంతో ముద్రగడ తాజాగా లేఖాస్త్రం సంధించారు.
గడువు లేకుండా కాపు రుణాలకు దరఖాస్తులను తీసుకోవాలని కూడా ఆయన ఆ లేఖలో కోరారు. ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాపు కార్పోరేషన్ రుణాల లబ్ధిదారులను ఎంపిక చేయడంలో జన్మభూమి కమిటీల పాత్రను తొలగించాలని కూడా ఆయన కోరారు.
జన్మభూమి కమిటీల్లో తెలుగుదేశం పార్టీవారే ఉండడంతో ఆ పార్టీకి చెందిన కాపుల దరఖాస్తులను మాత్రమే తీసుకుని, ఇతరుల దరఖాస్తులను తిరస్కరిస్తారనే ఉద్దేశంతో ఆయన జన్మభూమి కమిటీల నుంచి వాటిని మినహాయించాలని కోరినట్లు ఆర్థం చేసుకోవచ్చు.