పవన్ కల్యాణ్ టార్గెట్ అదేనా..: చిరంజీవి ఇలా...
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కొత్త సమీకరణాలకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బిజెపి, తెలుగుదేశం పార్టీలకు దూరం కావడం వెనక ఓ పథకం ఉండే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. పవన్ కల్యాణ్ లక్ష్యం తన అన్నయ్య చిరంజీవిని ముఖ్యమంత్రిని చేయడం కావచ్చునని అంటున్నారు.
ప్రస్తుతం తన 150వ సినిమా నిర్మాణంలో బిజీగా ఉన్న చిరంజీవి వచ్చే ఎన్నికల నాటికి దూకుడుగా రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసు తరఫునే ఆయన రాజకీయాల్లో ఉంటారని అంటున్నారు. పవన్ కల్యాణ్ లక్ష్యానికి అనుగుణంగా కాంగ్రెసు పార్టీ చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేదని చెబుతున్నారు.
చిరంజీవిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తూ పవన్ కల్యాణ్తో దోస్తీకి వ్యూహరచన చేస్తుందని అంటున్నారు. ప్రత్యేక హోదా విషయంలోనే పవన్ కల్యాణ్ బిజెపిని, టిడిపిని వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో ప్రత్యేక హోదా కోసం కాంగ్రెసు పార్టీ పట్టుబడుతోంది. అయితే, కాంగ్రెసు పార్టీ తనంత తానుగా వచ్చే ఎన్నికల నాటికి తిరిగి బలం పుంజుకునే అవకాశాలు లేవు. దీంతో అటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో గానీ, ఇటు జనసేనతో గానీ అది పొత్తు పెట్టుకోవడానికి అవకాశం ఉందని చెబుతున్నారు.

పవన్ కల్యాణ్కు ఇల్లు దొరికింది...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన ముద్ర వేసి, బలం పుంజుకోవడానికి పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆయన ఓటు హక్కును నమోదు చేయించుకుంటున్నారు. ఏలూరులో ఇప్పటికే పవన్ కల్యాణ్కు ఇల్లు దొరికిందని, దాదాపుగా ఆయన దాన్ని ఖరారు చేశారని అంటున్నారు. ఏలూరులో తన నివాసాన్ని, కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రజలకు దగ్గర కావచ్చుననేది ఆయన నమ్మకంగా చెబుతున్నారు.

చిరంజీవి కాంగ్రెసు నుంచి ఇలా...
కాంగ్రెసు పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు వస్తే పవన్ కల్యాణ్ కాంగ్రెసుకు మద్దతు ఇవ్వడానికి ముందుకు రావచ్చునని అంటున్నారు. తన రాజకీయాలు వేరు, తన తమ్ముడి రాజకీయాలు వేర్వేరు అయినప్పటికీ కుటుంబ సభ్యులుగా కలిసే ఉన్నామని చిరంజీవి ఒకటి రెండుసార్లు చెప్పారు. అయితే, ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని వంటి అంశాల ప్రాతిపదికపై పవన్ కల్యాణ్తో కాంగ్రెసు దోస్తీకి ముందుకు రావచ్చునని అంటున్నారు. ఇది పవన్ కల్యాణ్కు కూడా అనుకూలంగానే ఉంటుందని భావిస్తున్నారు.

రాయలసీమలోనూ... ఆంధ్రలోనూ...
పవన్ కల్యాణ్తో దోస్తీ కుదిరితే చిరంజీవి తిరుపతి నుంచే పోటీ చేసే అవకాశాలు ఉండవచ్చు. దీనివల్ల ఇటు రాయలసీమలో కాంగ్రెసు ప్రభావం, ఆంధ్రలో పవన్ కల్యాణ్ ప్రభావం కలిసి రావచ్చు. కాంగ్రెసుకు రాయలసీమలో కాస్తా ఉనికి ఉంది. అందువల్ల రెండు ప్రాంతాల్లోనూ జనసేన, కాంగ్రెసు కలిసి పోటీ చేస్తే లక్ష్యం సాధించడానికి వీలుంటుందని అంటున్నారు. చిరంజీవిని ముఖ్యమంత్రిగా చూడాలనే లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికే బిజెపి రాజ్యసభ సీటును ఇస్తామన్నా పవన్ కల్యాణ్ తిరస్కరించినట్లు చెబుతున్నారు.

మరి వైయస్ జగన్ ఏం చేస్తారు...
జగన్ తాను ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారు కాబట్టి కాంగ్రెసు ఫార్ములాకు అంగీకరించకపోవచ్చు. అయితే, ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలు మారితే తెలుగుదేశం పార్టీకి షాక్ ఇవ్వడానికి ఆయన ముందుకు రావచ్చు. ఈ కాంగ్రెసు కాకలు తీరిన కాంగ్రెసు నాయకులకు ఉందని చెబుతున్నారు.

బలమైన వారిని దింపడం ద్వారా...
వచ్చే ఎన్నికల నాటికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీని తుడిచిపెట్టాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పక్కా ప్లాన్తో ముందుకు సాగుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలను, బలమైన నాయకులను చేర్చుకుని, వచ్చే ఎన్నికల్లో వారిని బరిలోకి దింపడం ద్వారా జగన్కు షాక్ ఇవ్వాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. అయితే, ఎన్నికల సమయంలో పరిస్థితి ఏమవుతుందనేది చెప్పలేం. టికెట్లు దక్కనివారి వల్ల త్రాసు పాసంగంలోకి వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు.

చంద్రబాబుకు ముద్రగడ సమస్యనే..
కాపు రిజర్వేషన్ల అంశం కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సమస్యగా మారవచ్చు. వచ్చే ఎన్నికల నాటికి కాపు రిజర్వేషన్ల కల్పన సాధ్యపడుతుందా అనేది అనుమానంగానే ఉంది. ఈ సమస్యపై ఇప్పటికే ముద్రగడ పద్మనాభం ఆందోళనలు చేపడుతూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి అది తీవ్ర రూపం కావచ్చు. పవన్ కల్యాణ్, చిరంజీవి కలిస్తే ఆయన ఆందోళన వారికి ఉపయోగపడవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications